INDvsENG 2nd Test: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు క్రికెట్లో రూల్స్ గురించిన అవగాహన ఎక్కువన్నది జగద్విదితం. క్రికెట్ రూల్స్ను అవపోసన పట్టిన ఈ తమిళ తంబీ తన యూట్యూబ్ ఛానెల్లో నిత్యం వాటి గురించి చర్చిస్తూనే ఉంటాడు. ఫీల్డ్లో మన్కడ్ ఔట్, ఐపీఎల్లో ఫస్ట్ రిటైర్డ్ హర్ట్ వంటి వినూత్న రూల్స్ను క్రికెట్లో సమర్థవంతంగా వాడే అశ్విన్.. తాజాగా వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ప్రముఖ అంపైర్ మారియస్ ఎరాస్మస్తో వాగ్వాదానికి దిగాడు. గ్రౌండ్లో నిత్యం కూల్గా ఉంటూ తన పని కానిచ్చేసే అశ్విన్.. అంపైర్తో వాగ్వాదానికి దిగాల్సిన అవసరమేమొచ్చింది..?
వైజాగ్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెమెరాలన్నీ భారీ శతకం (179 నాటౌట్)తో భారత్కు భారీ స్కోరు అందించిన యశస్వీ జైస్వాల్ వైపునకు తిరిగాయి. కానీ మరో ఎండ్లో అశ్విన్.. ఎరాస్మస్తో ఏదో సీరియస్గా చర్చిస్తున్నాడు. దీంతో జైస్వాల్తో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు, కెమెరాలన్నీ అశ్విన్ను ఫోకస్ చేశాయి. ఎరాస్మస్తో కాస్త సీరియస్గానే చర్చించిన అశ్విన్.. కొన్ని క్షణాల తర్వాత అసహనంగా అక్కడ్నుంచి కదిలాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ravichandran Ashwin got angry during the conversation with the Umpire Marais Erasmus in India vs England 2nd Test at Vizag. pic.twitter.com/O5K3poT685
— Crickaith (@Crickaith) February 2, 2024
ఓ ఎక్స్ (ట్విటర్) యూజర్ అశ్విన్.. ఎరాస్మస్తో చర్చిస్తున్న ఫోటోను నెట్టింట షేర్ చేసిన వెంటనే ఆ పోస్టు కింద నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘సైంటిస్ట్ అశ్విన్.. అంపైర్ ఎరాస్మస్తో క్రికెట్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు..’, ‘ఎరాస్మస్ అశ్విన్ను మరో ఓవర్ బ్యాటింగ్ చేయాల్సిందిగా అడిగాడు. అందుకే అశ్విన్ ఇలా కోప్పుడుతున్నాడు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక టెస్టులో ఒకరోజు 90 ఓవర్లు ముగిసినా ఇంకా ఎందుకు ఆడిస్తున్నావని ఎరాస్మస్తో అశ్విన్ చర్చిస్తున్నాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వాస్తవానికి అశ్విన్.. ఎరాస్మస్తో ఏం చర్చించాడన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే..!