రైతులు దిగులు పడొద్దు.. సన్నవడ్లు పండిస్తే మేలు
కరోనాపై జాగ్రత్తగా ఉండాలి
సీఎం మార్గదర్శనం వల్లే రాష్ర్టానికి 12 కేంద్ర అవార్డులు
విలేకరుల ససమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ధాన్యం కొనుగోళ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కొవిడ్,
పాలకుర్తి టూరిజంపై జనగామ కలెక్టరేట్లో సమీక్ష
పాల్గొన్న ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, జడ్పీచైర్మన్, కలెక్టర్
జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 1 : పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులు దిగులు పడొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. గురువారం కలెక్టరేట్లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంటిగ్రేడెట్ మార్కెట్, కొవిడ్, పాలకుర్తి టూరిజం పనులపై ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి కలెక్టర్ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఇర్రి రమణారెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అబ్దుల్ హమీద్తో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత అనుభవాల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తేమ, తాలు లేకుండా నాణ్యమైన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులను ముందుగానే చైతన్యం చేయాలని సూచించారు. కొవిడ్ను దృష్టిలో ఉంచుకొని ఏ రైతు, ఏ కేంద్రానికి ఏ రోజు ధాన్యం తేవాలో ముందస్తుగా టోకెన్లు ఇస్తామని తెలిపారు.
జిల్లాలో యాసంగి సీజన్లో 3లక్షల 67వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందనే అంచనాతో 176 గ్రామాల్లో 187 కొనుగోలు కేంద్రాలతోపాటు జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, కొడకండ్ల ఏఎంసీలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు గ్రామానికో అధికారిని ఇన్చార్జిగా నియమిస్తామన్నారు. 28లక్షల గోనె సంచులు, 4592 టార్పాలిన్లు, 203 తూకం యంత్రాలు, 5 గోదాములు, 35 రైస్ మిల్లులకు ధాన్యం తరలించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో 646 కల్లాల నిర్మాణం పూర్తయిందన్నారు. జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా తడకలతో పందిళ్ల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, ప్రతి కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం సహా భౌతిక దూరం పాటించాలని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు 9 వేల 675 మందికి మొదటి వి డుత, 2వేల 461మందికి రెండో విడుత వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.ప్రభుత్వం పల్లెప్రగతి ద్వా రా పారిశుధ్య పనులు చేపట్టడం తో కరోనా వైరస్ను కట్టడి చేశామ ని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.
సన్నరకం ధాన్యం పండించండి..
రైతులు సన్నరకం వరి పండించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా లాభసాటిగా ఉందని, ప్రభుత్వం కూడా రైతుకు నష్టం జరుగకుండా చూస్తుందని మంత్రి అన్నారు. పంటలకు కేంద్రం ధరలు నిర్ణయించక పోవడంతో గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం రూ. 20వేల కోట్లు అప్పుతెచ్చి మద్దతు ధర కల్పించిందని గుర్తుచేశారు.
వచ్చే వానకాలం సీజన్ నుంచి రైతులు సన్న రకంతోపాటు కందులు, పత్తి, పామాయిల్ తోటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కోరిన విధంగా మల్లన్నగండి రిజర్వాయర్లోకి గోదావరి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం రూ.34.50 కోట్లు కేటాయించిందన్నారు. పాలకుర్తికి రూ.10కోట్లు, బమ్మెరకు రూ.7.5 కోట్లు, వల్మిడికి రూ.5కోట్లు, జఫర్గడ్ కోటకు రూ.6కోట్లు విడుదలయ్యాయని అన్నారు.
కేంద్ర నిధుల్లో రూ.487కోట్ల కోత..
గత ఏడాది కేంద్రం నుంచి తెలంగాణలోని పంచాయతీలకు రూ.1847కోట్లు వస్తే ఈసారి రూ.1360కోట్లు మాత్రమే వచ్చాయని, రూ.487కోట్ల నిధులను తగ్గించిందన్నారు. అన్ని రాష్ర్టాలకంటే ఎక్కువ అవార్డులు ఇచ్చిన కేంద్రం నిధులను మాత్రం కుదించడం మోసపూరిత చర్య అని మంత్రి మండిపడ్డారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం గ్రామీణాభివృద్ధికి పాటుపడినందుకు నిధులు తగ్గించారా? ఇప్పటివరకు జడ్పీలు, ఎంపీపీలు, జీపీలకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోగా, మునుపటి నిధులను తగ్గించడం మోసం కాదా? అని నిలదీశారు. గ్రామీణాభివృద్ధికి కేటాయించే నిధుల కోతపై తమ శాఖ తరఫున కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
చెరువులు, కుంటలు నింపాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి..
జనగామ నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపాలని కోరుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు వినతిపత్రం అందించారు. బొమ్మకూర్, వెల్దండ, కన్నెబోయిన గూడెం, తపాస్పల్లి రిజర్వాయర్ల ద్వారా అన్ని చెరువులు, కుంటలు నింపి సాగు నీటిని విడుదల చేయాలని కోరారు.
ఇవి కూడా చుడండి
తేలికపాటి బుల్లెట్ఫ్రూఫ్ జాకెట్లు