BJP | హైదరాబాద్, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ): రెండు నెలల కిందట ఫిబ్రవరి 5న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. గత 77 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కసారి 414 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదీ 1984లో ఇందిరాగాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా వచ్చిన సానుభూతి ఓట్లతో మాత్రమే. బీజేపీ 2014లో 428 స్థానాల్లో పోటీ చేసి 282 సీట్లు గెలుచుకున్నది. ఇక 2019లో 436 సీట్లలో పోటీ చేసి 303 సీట్లు సాధించింది. ఆ క్రమంలోనే 370 సీట్లు గెలవడం సాధ్యమని మోదీ భావించి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ఎన్నికల వేడి పుంజుకున్న నేపథ్యంలో బీజేపీ గెలుచుకోబోయే సీట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న 303 ఎంపీలలో రాజీనామాలు, ఎంపీల మరణాలు, ఉప ఎన్నికలు వంటి కారణాలతో 14 స్థానాలను బీజేపీ కోల్పోయింది. దాంతో ప్రస్తుతం అధికార పార్టీకి లోక్సభలో 289 సభ్యులున్నారు. పార్టీ విజయంపై మోదీ ఆత్మవిశ్వాసం నిజం కావాలంటే ప్రస్తుతమున్న ప్రతి స్థానాన్ని నిలుపుకోవడం, గత ఐదేండ్లలో కోల్పోయిన 14 సీట్లను తిరిగి గెలుచుకోవడంతోపాటు అదనంగా మరో 67 సీట్లు తెచ్చుకోవాలి. ప్రస్తుత ఎన్నికల్లో ఆ సీట్లన్నింటినీ మళ్లీ బీజేపీ పొందగలదా అంటే ప్రశ్నార్థకమే. ఈ సారి కొత్తగా బీజేపీకీ కలిసి వచ్చే అంశాలు గానీ, ప్రాంతాలు గానీ ఏమీలేవు. ఈ ఐదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేరువ కాకపోగా అధికంగా వ్యతిరేకతను మూటగట్టుకున్నది.
రెండో విడత అధికారం చేపట్టిన బీజేపీ ఆ తర్వాత తీసుకున్నవన్నీ ప్రజావ్యతిరేక నిర్ణయాలే. పెట్రోల్, గ్యాస్ ధరల రెట్టింపు, నిత్యావసర ధరల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, నూతన వ్యవసాయ చట్టాలు, పెరిగిన రైతుల ఆత్మహత్యలు, తీవ్ర ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ ప్రజలను అల్లకల్లోలం చేసి, తీవ్ర వేదనలోకి నెట్టివేశాయి. ఆ కారణంగా బీజేపీ ప్రాబల్యమున్న రాష్ర్టాల్లోనే ఆ పార్టీకి 2019 ఎన్నికలనాటి విజయం అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయా రాష్ర్టాల్లో మళ్లీ 2019 ఎన్నికల్లో మాదిరి 249 సీట్లు గెలిచిందనుకున్నా కూడా 370 స్థానాలను పొందాలంటే మిగతా భారతావనిలోని 213 స్థానాల నుంచి 121 సీట్లు గెలవాలి. ఆ 213 స్థానాల్లో గతంలో 54 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీకి ఇది ఎంతవరకు సాధ్యమో చూద్దాం.
బీజేపీకి బలం లేని రాష్ర్టాల్లో విజయం సాధించే సీట్లు పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ఈ రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రజల్లో మంచి బలం ఉన్నది. అలాగే స్థానిక సమస్యలపై బీజేపీకి సరైన అవగాహన లేని కారణంగా జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలపై ఆయా రాష్ర్టాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఉదాహరణకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహణను అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. పదేండ్ల బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, పెట్రో, గ్యాస్ ధరలు రెట్టింపవడం, ధనవంతులే మరింత అభివృద్ధి చెందడం వంటివి ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. నిరుద్యోగం పెరిగిపోయి యువతలో వ్యతిరేకత పెల్లుబుకింది. రైతు వ్యతిరేక చట్టాలు, గిట్టుబాటు ధరకు హామీ లేకపోవడం వంటి సమస్యలతో రైతుల్లో ఆత్మహత్యలు పెరిగాయి.
ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన మీదట బీజేపీకి గట్టి పట్టున్న రాష్ర్టాల్లోని 330 స్థానాలకు గాను 220 సీట్లు గెలుచుకుంటే గొప్పేనని, అలాగే బీజేపీకి అంతగా బలం లేని రాష్ర్టాల్లోని 213 స్థానాలకు గాను ఈ సారి 30 సీట్లు గెలుచుకోవచ్చునని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రాంతీయ పార్టీలపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకం కారణంగా బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో మొత్తం మీద 250 సీట్లకు మించి గెలుచుకునే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆ కారణంగానే సందిగ్ధతతో కొట్టుమిట్టాడుతున్న బీజేపీ మైండ్గేమ్కు తెరతీసిందని, అందులో భాగంగానే 370 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ప్రచారం మొదలు పెట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు. చిన్నా చితకా పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడానికి కూడా ఇదే కారణమని వారు స్పష్టం చేస్తున్నారు.