హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): బానిస సంకెళ్లు.. అభద్రతాభావం..నెలల తరబడి వేతనాలు రాక బిక్కుబిక్కుమంటూ గడిపిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సంకెళ్లను గత కేసీఆర్ సర్కారు తెంచి శనివారానికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. 2023 మే 4న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వగా, అదే రోజు విధుల్లో చేరారు. అనేక అడ్డంకులను తొలగించి గత కేసీఆర్ సర్కారు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది.
ఇంటర్, కళాశాల, సాంకేతిక విద్యలోని 3,897 అధ్యాపకులు, ఉద్యోగులు, ఇతరశాఖలోని 1,647 మంది ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించింది. దీంతో మొత్తంగా 5,544మంది ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ఇందుకు సహకరించిన ఐఏఎస్ అధికారి నవీన్మిట్టల్ను తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసొసియేషన్ (టీజీఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం, సిద్ధారెడ్డి, జిల్లా నర్సింహా, మాలతి, పంజాగంగాధర్, కట్టయ్య, వేణుగోపాల్ తదితరులు కలిసి ధన్యవాదాలు తెలిపారు.