సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్న యాంటీ ఫంగల్ మందులను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్రెడ్డి తెలిపిన ప్రకారం.. యాంటీ ఫంగల్ చికిత్సకు ఉపయోగించే ‘గ్రిసోవెల్ -ఎఫ్పీ-250’ టాబ్లెట్లను హిమాచల్ప్రదేశ్ కేంద్రంగా అల్వెంట ఫార్మా లిమిటెడ్ తయారు చేయగా ముంబైకి చెందిన ఎల్డర్ లేబరేటరీస్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తున్నది.
10 టాబ్లెట్ల ధరను జీఎస్టీతో కలిసి రూ.19.82గా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) నిర్ణయించింది. కేంద్రం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా సదరు కంపెనీ 10 మాత్రలను రూ.80కు విక్రయిస్తూ రూ.60.17 అధికంగా వసూలు చేస్తున్నది. ఈ మేరకు డీసీఏ అధికారులు శనివారం భద్రాచలంలోని మెడికల్ షాపులపై దాడులు జరిపి, నిర్ణీత ధరల కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న ‘గ్రిసోవెల్-ఎఫ్పీ-250’మాత్రలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం డ్రగ్స్ తయారీ కంపెనీతో పాటు మార్కెటింగ్ చేసే కంపెనీకి నోటీసులు జారీచేశారు.