న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ప్రజల ముందు కేంద్రం తలవంచక తప్పదని పేర్కొన్నాయి. విద్యా వ్యవస్థను సరిదిద్దాలని గళమెత్తిన యువతకు దక్కిన విజయమని అభివర్ణించాయి. (Dharmendra Pradhan ) ‘విద్యా వ్యవస్థను సరిదిద్దాలని దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి గళమెత్తిన లక్షలాది మంది యువతకు ఇది విజయం. అవినీతిమయమైన ఈ ప్రభుత్వం కారణంగా తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలందరికీ ఇది విజయం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం పార్లమెంట్ నుంచి వీధుల వరకు గళమెత్తిన ఐక్య ప్రతిపక్షానికి ఇది విజయమని అభివర్ణించారు.
కాగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ‘ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని ఎప్పటికీ తప్పించుకోలేమన్న వాస్తవాన్ని అంగీకరించడమే’ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు. ‘శాంతియుత నిరసన తెలిపే తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్న ఎంతో మంది యువ భారతీయులు పోలీసుల క్రూరత్వానికి, బలప్రయోగానికి గురైన తర్వాత ఇది జరిగింది. రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు దీనిపై ఆందోళన చెందాలి’ అని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ‘ప్రజాస్వామ్యానికి పెద్ద విజయం’ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ‘మన యువతకు అభినందనలు’ అంటూ ఒక వీడియో విడుదల చేశారు.