జగదేవ్పూర్, ఏప్రిల్ 26: ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో 100 రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. జగదేవ్పూర్లోని పీర్లపల్లి మాజీ సర్పంచ్ అంకిల్ల యాదవరెడ్డి ఏర్పాటు చేసి రుద్ర ట్రేడర్స్ను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మండల నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నీళ్లు ఉన్నా ఇవ్వలేని దుస్థితి, కరెంట్ ఉన్నాసరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ కరువుకాటకాలతో తల్లిడిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గోదారి జలాలను పారించి బీడు భూములను పచ్చని మాగాణులగా మార్చారన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో అప్పటి పరిస్థితులు మళ్లీ వస్తున్నాయన్నారు. కేసీఆర్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కారు హామీల అమలులో ఘోరంగా విఫలమైందన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నర్సింహారెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, కొండపోచమ్మ ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, జగదేవ్పూర్ ఎంపీటీసీ కవితాశ్రీనివాస్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, నాయకులు మహేశ్, కనకయ్య, చంద్రం, రవి, దర్గయ్య, బషీర్, శ్రీశైలం, బాల్నారాయణ, నాగరాజు తదితరులు ఉన్నారు.
ప్రజా సేవ కోసం వస్తున్న తనను ఆశీర్వదించాలని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పని చేశామన్నారు. ఎంపీగా గెలిపిస్తే రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని, యువతీ యువకులకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి పేదలకు ఉచితంగా శుభకార్యాలకు అందించనున్నట్లు తెలిపారు. యువతీ యువకులు ఒక్కసారి ఆలోచించి ఎవరితో అభివృద్ధి సాధ్యమో గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గ్రామాల్లో తెలియజేయాలన్నారు. జగదేవ్పూర్ మండల ప్రజలతో తనకు ప్రత్యేక అనుభవముందని, ఇక్కడి అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఎంతో ఉందని, మండలానికి ఎన్నోసార్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ శ్రేణులతో ముచ్చటిస్తూ ప్రతి కార్యకర్త సైనికుల్లా గడప గడపకూ వెళ్లి ప్రచారం చేపట్టాలా కృషి చేయాలన్నారు. తనకు సహకరించిన ప్రతిఒక్కరినీ గుర్తుంచుకొని అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు.