దుబాయ్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్లకు అంగీకరించని భారత్.. గత కొన్నేండ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే పాక్తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న పొట్టి ప్రపంచకప్నకు సంబంధించిన ‘డ్రా’ను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. మార్చి 20 నాటి ర్యాంకింగ్స్ ఆధారంగా మెగాటోర్నీకి అర్హత సాధించిన 8 జట్లను రెండు పూల్స్గా విభజించగా.. అందులో రెండో గ్రూప్లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పూల్-1లో చోటు దక్కించుకున్నాయి. వీటితోపాటు క్వాలిఫయింగ్ రౌండ్ల ద్వారా అర్హత సాధించే మరో నాలుగు జట్లు వరల్డ్కప్ బరిలోకి దిగనున్నాయి.
క్వాలిఫయింగ్ టోర్నీలో శ్రీలంక, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్ గ్రూప్-ఏలో పోటీ పడుతుండగా.. గ్రూప్-బీ నుంచి బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వీటిలో లంక, బంగ్లా మెగాటోర్నీలో ఆడటం ఇప్పటికే ఖాయం కాగా.. మరో రెండు జట్లపై స్పష్టత వచ్చిన అనంతరం ఏ జట్టు ఏ పూల్లో బరిలో దిగుతుందో తేలనుంది. ఈ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. కరోనా వైరస్ విజృంభణ కారణంగా యూఏఈకి తరలించారు. అయితే ఆతిథ్య బాధ్యతలు మాత్రం బీసీసీఐ నిర్వర్తిస్తున్నది.
పూల్ 1: వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ గ్రూప్-ఏ విజేత, గ్రూప్-బీ రన్నరప్.
పూల్ 2: భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, క్వాలిఫయర్ గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్-బీ విజేత.