IND vs ENG 2nd Test: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్.. పర్యాటక జట్టు ఎదుట 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భాగంగా ఆట మూడోరోజు ఇంగ్లండ్.. 14 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 332 పరుగులు అవసరం కాగా భారత గెలుపునకు 9 వికెట్లు కావాలి. ఆసక్తికరంగా మారిన వైజాగ్ టెస్టు ఛేజింగ్ నేపథ్యంలో అసలు ఇంతవరకు భారత్లో టెస్టులు ఆడుతూ పర్యాటక జట్లు ఛేదించిన హయ్యస్ట్ టార్గెట్ ఎంత..? ఆ జట్టు ఏది..? వివరాలు ఇక్కడ చూద్దాం.
స్పిన్కు అత్యంత అనుకూలంగా ఉండే ఉపఖండపు పిచ్లపై ఇప్పటివరకూ నాలుగో ఇన్నింగ్స్లో 300 ప్లస్ స్కోరు చేసిన సందర్భాలు ఐదు మాత్రమే. అదీగాక 250 ప్లస్ టార్గెట్ను ఛేదించిన పర్యాటక జట్టు ఒక్క వెస్టిండీస్ మాత్రమే. 1987లో ఢిల్లీ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని విండీస్ విజయవంతంగా ఛేదించింది. భారత్లో ఒక పర్యాటక జట్టు ఛేదనలో ఇన్ని పరుగులు చేయడం ఇదే ప్రథమం. 300 ప్లస్ టార్గెట్ను ఇప్పటిదాకా ఏ పర్యాటక జట్టూ ఛేదించలేదు.
భారత్లో టెస్టు ఆడుతూ నాలుగో ఇన్నింగ్స్లో 300 ప్లస్ టార్గెట్ ఛేదనలు..
1. 2008లో ఇంగ్లండ్తో చెన్నై వేదికగా ముగిసిన మ్యాచ్లో భారత్.. 387 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత గడ్డపై ఇప్పటివరకూ ఇదే అత్యధిక ఛేదన.
2. 1979లో పాకిస్తాన్తో ఢిల్లీలో జరిగిన టెస్టులో పాకిస్తాన్ నిర్దేశించిన 389 పరుగుల ఛేదనలో భారత్.. 6 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రా అయింది.
3. 1949లో వెస్టిండీస్తో ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో కరేబియన్ జట్టు నిర్దేశించిన 360 పరుగుల ఛేదనలో భారత్.. 8 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రా అయింది.
4. 1986లో ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆడిన టెస్టులో ఆసీస్ నిర్దేశించిన 347 పరుగుల ఛేదనలో భారత్.. సరిగ్గా 347 రన్స్ చేసి ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టై అయింది.
5. 1948లో వెస్టిండీస్తో ఈడెన్ గార్డెన్స్ (కోల్కతా) వేదికగా మ్యాచ్లో నాలుగో ఇన్నింగ్స్లో విండీస్ విధించిన 430 పరుగుల ఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ కూడా డ్రా అయింది.
What an opportunity ahead.
Fourth innings. 332 more to win.
And you know we’re going for it 💪
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/Twij9vY7rW
— England Cricket (@englandcricket) February 4, 2024
– భారత్తో 300 ప్లస్ టార్గెట్లు ఛేదించిన జట్లు రెండే రెండు. అవి కూడా విదేశాలలోనే.. అందులో ఒకటి ఇంగ్లండ్ కాగా రెండోది ఆస్ట్రేలియా. 1977లో ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 339 పరుగుల ఛేదనను ఆసీస్ ఛేదించింది. ఇక 2022లో బర్మింగ్హామ్ వేదికగా ఇదే ఇంగ్లండ్ టీమ్తో బెన్ స్టోక్స్ సారథ్యంలోనే భారత్ తమ ముందుంచిన 378 పరుగులను ఇంగ్లండ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం గమనార్హం. బజ్బాల్ ఆటతో టెస్టులను జనరంజకంగా మలుస్తున్న ఇంగ్లండ్.. వైజాగ్లో మరో 332 పరుగులు సాధిస్తే భారత గడ్డపై సరికొత్త చరిత్ర లిఖించినట్టే..!