దుబాయ్ : ఈ ఏడాది ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వేదికను మార్చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలకు మార్చినట్లు ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది. తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ఐసీసీ పోస్టు చేసింది. అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు టీ20 వరల్డ్కప్ను నిర్వహించనున్నారు. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో వరల్డ్కప్ టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే టోర్నీ జరుగుతుంది. మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్లు ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జయిదా స్టేడియం(అబుదాబి), ద షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో మ్యాచ్లను నిర్వహించనున్నారు.
టోర్నమెంట్ తొలి రౌండ్లో.. అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒమన్, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్లు.. సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్తో కలుస్తాయని ఐసీసీ తన ట్వీట్లో తెలిపింది. ఎమిరేట్స్, యూఏఈ వేదికల్లోనే టీ20 వరల్డ్కప్ను నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించిన విషయం తెలిసిందే.
ప్రిలిమనరీ స్టేజిల్లో పోటీపడే దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్ల్యాండ్, నమీబియా, ఒమన్, పప్వా న్యూ గునియాలు ఉన్నాయి. టీ20 వరల్డ్కప్ను సురక్షితమైన వాతావరణంలో నిర్వహించడమే తమ ఉద్దేశమని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలర్డైస్ తెలిపారు.