David Warner : టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయంగా నిలిచిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు కౌంట్డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ ఫైట్ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా ఫైట్పై ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్లో ఒక మ్యాచ్ బదులు మూడు మ్యాచ్లు పెడితే బాగుంటుందని అన్నాడు. అందుకు కారణం కూడా చెప్పుకొచ్చాడు.
‘రెండేళ్లు అద్భుతంగా ఆడుతాం. అయితే.. తటస్థ వేదికపై ఫైనల్ పోరులో తలపడతాం. తీరా ఫైనల్కు వచ్చేసరికి ఒక్క మ్యాచ్తో విజేతను నిర్ణయిస్తారు. అది సమంజసం కాదు. అలాకాకుండా మూడు మ్యాచ్లు పెడితే బాగుంటుంది’ అని వార్నర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ఫైనల్లో రెండు బెస్ట్ టీమ్స్ పోటీపడుతున్నాయని అతను అన్నాడు. ‘రెండు ప్రపంచ స్థాయి బౌలర్లు డ్యూక్స్ బంతి(Dukes Ball)తో తటస్థ వేదికపై ఆడనున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం. ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఆతృతగా ఉన్నాం. మేము ఇంగ్లండ్లో ఇంతకుముందు ఆడాం. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్ మాత్రం అలా కాదు. కొత్త ప్రత్యర్థితో పోటీ పడుతున్నాం. భారత్ ఎలా ఆడుతుందో మాకు తెలుసు’ అని ఈ ఎడమ చేతివాటం బ్యాటర్ తెలిపాడు.
వచ్చే ఏడాది టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్టు వార్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2024లో సొంతగడ్డపై పాకిస్థాన్ సిరీస్ తన ఆఖరి మ్యాచ్ అని అతను నిన్న సాయంత్రం చెప్పాడు. గత కొంత కాలంగా వార్నర్ టెస్టుల్లో అంతగా రాణించడం లేదు. బాక్సింగ్ డే టెస్టులో డబుల్ సెంచరీ తప్పితే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)లో అతను విఫలమయ్యాడు. దాంతో, అతడి ప్లేస్లో ట్రావిస్ హెడ్ జట్టులోకి వచ్చాడు. అయితే.. ఐపీఎల్ 16వ సీజన్లో వార్నర్ అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఎంపికైన అతను పలు మ్యాచుల్లో ఒంటరి పోరాటం చేశాడు. అర్ధ సెంచరీలు బాదాడు. దాంతో, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఓపెనర్ను ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ఎంపిక చేసింది.