Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారీ ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ (73) 2023, ఆగష్టు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. కొంతకాలంగా ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవరూ పెద్దగా కలవలేదు. ఇందుకు ప్రభుత్వం అనుమతించడం లేదు. పైగా ఆయన అనారోగ్యం క్షీణిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన తరఫున పాక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనకు చికిత్స అందించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇమ్రాన్ఖాన్ను వెంటనే చికిత్స కోసం ఇస్లామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. 48 గంటల్లోగా ఆయనకు షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, సెప్టెంబర్ 16 వరకు అక్కడే ఉంచాలని సూచించింది. అక్కడ నిపుణులైన వైద్యబృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించి, నివేదిక ఇస్తుందని తెలిపింది. ఈ బృందంలో ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడితోపాటు అతడి సోదరి డా.అలీమా ఖాన్ కూడా ఉండాలని సూచించింది. అలాగే, ఆస్పత్రిలో అతడి కొడుకులు సహా కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతించాలని కూడా కోర్టు ఆదేశించింది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్కు చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై పాక్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే, ప్రభుత్వ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలపై ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. ఈ నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) ప్రతినిధి జుల్ఫికర్ అలీ బుఖారి స్వాగతించారు. కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆయన కంటిచూపు, ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఉంటుందని ఆయన అన్నారు. ఇమ్రాన్ ఖాన్ తనయులు ప్రస్తుతం లండన్లో ఉన్నారు. వారు కూడా తన తండ్రిని కలుసుకునేందుకు కోర్టు అనుమతించింది.