David Warner: తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆఖరి మ్యాచ్లో సెంచరీ చేసి ఆటకు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో వార్నర్ భాయ్.. తొలి ఇన్నింగ్స్లో 68 బంతులు ఎదుర్కుని నాలుగు బౌండరీల సాయంతో 34 పరుగులు మాత్రమే చేశాడు. ఆమీర్ జమల్ బౌలింగ్లో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న సమీ అయూబ్ క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోవడంలో వార్నర్ విఫలమయ్యాడు.
ఆట రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 6-0తో బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్ ప్రారంభ ఓవర్లలో నెమ్మదిగా ఆడింది. జమాల్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతి వార్నర్ బ్యాట్ను ముద్దాడుతూ స్లిప్స్ దిశగా వెళ్లింది. ఫస్ట్ స్లిప్లో ఉన్న అయూబ్.. క్యాచ్లు వదిలేయడంలో తన సీనియర్ల నుంచి స్ఫూర్తి పొందాడో ఏమో గానీ ఈజీ క్యాచ్ను నేలపాలు చేయడంతో వార్నర్కు లైఫ్ దొరికింది. కానీ వార్నర్ను.. పార్ట్ టైమ్ స్పిన్నర్ అఘా సల్మాన్ ఔట్ చేశాడు. అతడు వేసిన 25వ ఓవర్లో వార్నర్.. స్లిప్స్లో బాబర్ ఆజమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో వార్నర్ ఇన్నింగ్స్ ముగిసింది.
It’s happened again! 😲
David Warner gets a life courtesy of the debutant Saim Ayub #AUSvPAK pic.twitter.com/VAr7bBis6L
— cricket.com.au (@cricketcomau) January 4, 2024
ఒకవేళ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వస్తే వార్నర్కు అదే టెస్టులలో లాస్ట్ ఇన్నింగ్స్ అవుతుంది. కానీ అలా కాకుండా భారీ స్కోరు చేసి పాక్ ముందు భారీ లక్ష్యం పెట్టి ఆ జట్టును త్వరగా ఆలౌట్ చేస్తే వార్నర్ బ్యాటింగ్ మళ్లీ చూసే (టెస్టులలో) అవకాశం లేదు. వార్నర్ ఔట్ అయి పెవిలియన్కు వెళ్తుండగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆటగాళ్లతో పాటు ఆట చూడటానికి వచ్చిన సుమారు 22 వేల మంది అభిమానులు.. అతడికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్విటర్లో డేవిడ్ వార్నర్ ఫేర్వెల్ కూడా ట్రెండింగ్లో ఉంది.
David Warner didn’t get a fairytale finish at the SCG.
As he walked into his sunset, the crowds gave him a wonderful appreciation.#AUSvPAK pic.twitter.com/mrghbyu4kO
— Vijay A (@VAAChandran) January 4, 2024
కాగా రెండో రోజు టీ విరామానికి ఆస్ట్రేలియా.. 47 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. వార్నర్ 34 పరుగులు చేసి ఔటవగా ఉస్మాన్ ఖవాజా 47 పరుగులు చేసి తృటిలో అర్థ సెంచరీ కోల్పోయాడు. ప్రస్తుతం మార్నస్ లబూషేన్ (23 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (6) లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఇంకా 197 పరుగులు వెనుకబడి ఉంది.