Telangana | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): పెట్టుబడుల సాధనలో గత పదేండ్లు దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా బ్రేకులు వేసినట్టు కొత్త పెట్టుబడులు ఆగిపోవడంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖరారైన పెట్టుబడులు సైతం క్రమంగా వెనక్కు మళ్లిపోతున్నాయి.
ప్రభుత్వం అమలుచేసే విధానాల ఆధారంగానే పెట్టుబడులు వస్తాయి. వరంగల్లో పరిశ్రమను ఏర్పాటు చేసిన కిటెక్స్ కంపెనీయే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మన రాష్ర్టానికి రావడానికి ముందు ఈ కంపెనీ ప్రతినిధులు 8 రాష్ర్టాల అధికారులు, ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. ఆ కంపెనీని శ్రీలంక కూడా ఆహ్వానించింది. అయినప్పటికీ తెలంగాణ పారిశ్రామిక విధానాలు, నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పనితీరు తదితర అంశాల దృష్ట్యా వరంగల్ వైపే మొగ్గింది. నాటి ప్రభుత్వ కృషే ఇందుకు కారణం. ఇప్పు డు పరిశ్రమలను పట్టించుకునే నాథుడే లేడు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి పారిశ్రామిక వర్గాలకు షాకిచ్చింది. దాదాపు అన్ని అనుమతులు వచ్చి.. పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న 16 వేల ఎకరాల ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా విలేజ్లు తెస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ మధ్య పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని, ఎంఎస్ఎంఈలకు కొత్త విధానాన్ని తెస్తామన్నారు. కానీ, 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు వీటిపై ఎటువంటి స్పష్టమైన పాలసీని ప్రకటించలేదు. ఇప్పటికే ప్రముఖ గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ కార్నింగ్ హైదరాబాద్ నుంచి మకాం మార్చింది. గత ఏడాది పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఈ కంపెనీ.. చెన్నైకి వెళ్లిపోయింది. ఇది రేవంత్ సర్కారుపట్ల పారిశ్రామిక వర్గాల్లో అపనమ్మకాన్ని చాటిచెప్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా పడకేసింది. కేంద్రంలో బీజేపీ సర్కారున్నా.. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో గత ప్రభుత్వం విజయవంతమైంది. పెట్టుబడిదారులకు సంపూర్ణ సహకారాన్ని అందించింది. ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలి ఇందుకు భిన్నంగా ఉన్నది. దీంతో గతంలో పెట్టుబడులకు దేశంలోనే ప్రధాన గమ్యస్థానంగా ఉన్న తెలంగాణ ఖ్యాతి క్రమంగా మసకబారుతున్నది.