Aakash Chopra : వెస్టిండీస్తో రెండో వన్డేకు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)కి రెస్ట్ ఇవ్వడంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అప్రధాన్య సిరీస్కు వాళ్లు అవసరమే లేదని కొందరు అంటుంటే.. మరి అలాంటప్పుడు అసలు ఎందుకు ఎంపిక చేశారని మరికొందరు వాదిస్తున్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) తర్వాత భారత్ ఆడుతోంది ఇదే సిరీస్ కాగా.. ఇంత సుదీర్ఘ విరామం లభించినా.. ప్రధాన ఆటగాళ్లకు మళ్లీ రెస్ట్ ఇవ్వడం ఏంటో తనకు అర్థం కావడం లేదని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) అన్నాడు.
‘రోహిత్, కోహ్లీకి విశ్రాంతి ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు. వాళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువ మ్యాచ్లు కూడా ఆడలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ (జూన్ 7 నుంచి 11 వరకు) తర్వాత ప్రతి ఒక్కరికీ కావాల్సినంత సమయం (నెల రోజులు) దక్కింది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్లోనూ మొత్తం 7 రోజుల ఆటే సాగింది. అలాంటప్పుడు పనిభారం అనే సమస్యే తలెత్తదు. ఈ తరుణంలో ఒక వన్డే ఆడి.. అందులోనూ 23 ఓవర్లు మాత్రమే ఫీల్డింగ్ చేసి.. మరుసటి మ్యాచ్కు విశ్రాంతి అనడం ఏమాత్రం సబబుగా లేదు’ అని ఆకాశ్ పేర్కొన్నాడు.
46 ఏండ్ల వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ చేతిలో భారత జట్టు ఓడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు’.. యువ ఆటగాళ్లు దుమ్మురేపుతారనుకుంటే.. పేలవ ఆటతీరుతో ఉసూరుమనిపించారు. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత తుదిజట్టులోకి వచ్చిన సంజూ శాంసన్(Sanju Samson) అక్షర్ పటేల్(Axar Patel) అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు.
విండీస్ బౌలర్ల ధాటికి టీమిండియా 181 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(57) హాఫ్ సెంచరీతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. చిన్న లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించి, సిరీస్ సమం చేసింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే ఆగస్టు 1న జరుగనుంది.