సిద్దిపేట టౌన్ : యువత సన్మార్గంలో వెళ్లాలని.. నేర్చుకున్న మంచిని ఇతరులకు నేర్పించాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ యువతకు సూచించారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్లో బుధవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మనుషులు సహజంగా తప్పులు చేస్తారని వాటిని సరిదిద్దుకొని జీవితాన్ని ఉన్నంతగా మలుచుకోవాలన్నారు.
వాల్మీకి మహర్షి మాదిరిగానే నేటి యువతరం ఆలోచన చేయాలన్నారు. రామాయణంలో 20 వేల శ్లోకాలలో ధర్మాన్ని వివరించారని చెప్పారు. చెడును వదిలి యువత మంచి దారిలో నడిస్తే ప్రతి ఒక్కరిలో వాల్మీకి మహర్షే కనబడుతారన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ సరోజ, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి లత, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్టడీ సర్కిల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.