CM Revanth Reddy | వరంగల్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు రుణమాఫీ, ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సగమే స్పందించారు. తనకు హరీశ్రావు విసిరిన సవాల్ను పూర్తిగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించే సాహసం చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోగా హామీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమా? అని హరీశ్రావు సవాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం వరంగల్లోని మణికొండలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్రావు అంటున్నడు. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలుస్తా. హరీశ్రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. అయితే, పంద్రాగస్టులోగా రుణమాఫీతో పాటు ఇతర హామీలు అమలు చేయకపోతే ఏమిటన్న దానిపై మాత్రం రేవంత్ మాట్లాడకపోవడం గమనార్హం. రుణమాఫీ చేయకుంటే రాజీనామాకు సీఎం సిద్ధమా? అన్న సవాల్పై రేవంత్రెడ్డి మౌనం పాటించారు. రుణమాఫీపై ఎక్కడికి వెళ్తే, అక్కడి దేవుండ్ల సాక్షిగా ప్రమాణం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి వరంగల్ ప్రచారంలోనూ అదే ఎత్తు వేశారు. ‘రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, వేయిస్తంభాల గుడి సాక్షిగా, మేడారం సమ్మక్క సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా’ అని పేర్కొన్నారు. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాల్ చేశారు. మేధావులు, నిఫుణుల మధ్య చర్చ పెడదామని, దమ్ముంటే రావాలని అన్నారు. ‘కేసీఆర్కు నేను సవాల్ విసురుతున్నా. నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైతే చర్చకు రా? నీకు దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రా’ అని పేర్కొన్నారు.
బీజేపీతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం
బీజేపీ రూపంలో దేశానికి ప్రమాదం పొంచి ఉన్నదని, ఆ పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని రేవంత్రెడ్డి హెచ్చరించారు. దేవుడి పేరు మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టేవారికి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లును తొలగిస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని విమర్శించారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. అరూరి రమేశ్ రంగులు, అంగీలు మార్చి బీజేపీ అభ్యర్థిగా వస్తున్నాడని, ఆయన గెలిస్తే అనకొండగా మారి అందరి భూములు అక్రమిస్తాడని ఆరోపించారు. వరంగల్కు రాష్ట్రంలో రెండో రాజధానిగా అర్హతలు ఉన్నాయని, తానే స్వయంగా వరంగల్లో కూర్చొని నగర సమస్యలను పరిష్కరిస్తానంటూ పలు హామీలు ఇచ్చారు.
రేవంత్ ప్రసంగం వేళ ఖాళీ కుర్చీలు
మడికొండలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వరంగల్ లోక్సభ నియోజకవర్గ స్థాయి జనజాతర బహిరంగసభకు జనం నుంచి స్పందన కరువైంది. ఈ సభను లక్ష మందితో నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించినప్పటికీ, అందులో పావువంతు కూడా రాలేదని పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం మొదలుపెట్టగానే సభకు వచ్చిన ఆ కొద్దిమంది ఇంటికి వెళ్లడం మొదలుపెట్టారు. సీఎం ప్రసంగం పూర్తికాక ముందే సభలో ముందు వరుసలో కూర్చున్న, వెనుక ఉన్న వారు చాలామంది వెళ్లిపోయారు. కాంగ్రెస్ జనజాతర సభకు జన స్పందన లేకపోవడం, వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మరింత పెరిగింది.
రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కలెక్టర్కు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
ఎదులాపురం, ఏప్రిల్ 24: ఈ నెల 22న ఆదిలాబాద్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున జరి గిన సభలో పాల్గొని ఓటర్లను ప్రభావితం చేసేలా.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రసంగించి, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఫిర్యాదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ‘ఆత్రం సుగుణ గెలవకపోతే.. ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షలు, ఆర్టీసీ ఫ్రీబస్, రూ.500 సిలిండర్ ఆగిపోయే ప్రమాదం ఉంది’ అని వ్యాఖ్యానించారని తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, మాజీ ఎంపీపీ సేవ్వ జగదీశ్, నాయకులు సతీశ్, ఆశీఫ్, ఖలీమ్ సాహెబ్లు ఉన్నారు.