‘ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నాం’ అంటూ మొన్నటివరకూ ధీమాగా చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ ప్రచారంలో రూటు మార్చారు. ‘వికసిత్ భారత్’ ఆవిష్కరిస్తామంటూ నిన్నటివరకూ ఊదరగొట్టిన ఆయన.. ఇప్పుడు ప్రచార సభల్లో ఆ నినాదాన్నే ప్రస్తావించట్లేదు. ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో జరిగిన తొలి దఫా ఓటింగ్ అనంతరం ఆయన ప్రసంగాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటివరకూ.. ఇదిచేశాం, అదిచేశాం అంటూ చెప్పుకోవడం, వివిధ రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న విపక్షాల పాలనపై దుమ్మెత్తిపోయడం, అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ‘వికసిత్ భారత్’ అంటూ కొత్త నినాదాన్ని మోసుకొచ్చిన ప్రధాని.. మొదటి దఫా పోలింగ్ కాగానే ఉన్నట్టుండి మతం, విద్వేషం తదితర అంశాలను ముంగటేసుకొన్నట్టు చెప్తున్నారు. తొలిదఫాకు సంబంధించి అంతర్గత సర్వేలు ఇచ్చిన ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణంగా విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ‘ఈసారి 400కు పైగా సీట్లు సాధిస్తామని, వికసిత్ భారత్ను ఆవిష్కరిస్తామంటూ నిన్నటివరకూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ.. ఇప్పుడు ప్రచార సభల్లో ఆ విషయాల్నే ప్రస్తావించట్లేదు. ఏప్రిల్ 19న జరిగిన తొలి దఫా ఓటింగ్ అనంతరం ఆయన ప్రసంగాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటివరకు అది చేశాం, ఇది చేశాం అంటూ చెప్పుకొచ్చిన ప్రధాని.. మొదటి దఫా పోలింగ్ కాగానే ఉన్నట్టుండి విద్వేష వ్యాఖ్యలకు దిగుతున్నారు. తొలిదఫాకు సంబంధించి అంతర్గత సర్వేలు ఇచ్చిన ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణంగా విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే, హనుమాన్ చాలీసాను వినడాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు. మన విశ్వాసాలను ఆచరించడం కూడా కష్టమే. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ తెగబడుతున్నది. ఎస్సీ, ఎస్టీ కోటా తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆంధ్రప్రదేశ్లో దీన్నో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అనంతరం దేశమంతటా అమలు చేయాలనుకొన్నది.
– మంగళవారం రాజస్థాన్లోని టోంక్ సభలో ప్రధాని మోదీ
అధికారంలోకి వచ్చాక ప్రజల వద్ద ఉన్న బంగారం సహా సంపదనంతా సర్వే చేసి అందరికీ సమంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పింది. అంటే మన అక్కా-చెల్లెళ్లు, తల్లుల మంగళ సూత్రాలను దోచుకొనేందుకు వాళ్లు చట్టాలను కూడా మార్చేస్తారు. ఎవరికైనా రెండు ఇండ్లు ఉంటే, ఒక ఇంటిని లాగేసుకొంటారు. ఎన్నో దేశాలను నాశనం చేసిన ఈ విధానాలు మనకు కావాలా?
– సోమవారం యూపీలోని అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
జాతి సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అర్బన్ నక్సలిజం మనస్తత్వం కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మన తల్లులు, చెల్లెళ్ల మంగళ సూత్రాలను కూడా వదలరు. దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి (ముస్లింలకు) పంచుతారు. ఇది మీకు సమ్మతమేనా?
– ఆదివారం రాజస్థాన్లోని జాలౌర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
ఎవరికి ఏం నచ్చితే అది తినొచ్చు. ఏ చట్టమూ దీన్ని అడ్డుకోలేదు. అయితే, నవరాత్రి, శ్రావణ మాసం వంటి పవిత్ర దినాల్లోనూ మాంసాన్ని తింటున్నారంటే వారి (ఆరెల్డీ నేత తేజస్వీయాదవ్ను ఉద్దేశిస్తూ..) ఉద్దేశం మరొకటి అయ్యి ఉండొచ్చు. ఇలాంటి మైండ్సెట్ మొగలాయిలకే ఉంటుంది.
-ఏప్రిల్ 12న ఉదంపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ