CM Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రశీదు తప్పితే మసీదు తప్పదన్నది తెలంగాణలో నానుడి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చివరికి దేవుడిపై ఒట్టేయడం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాటి. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. రా్రష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల లోపున్న వ్యవసాయ రుణాలను 100 రోజుల్లోగా మాఫీ చేస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ సైతం నిరుడు డిసెంబర్ 9న ఎన్నికల ప్రచార వేదికపై నుంచి ఇదే మాట ఇచ్చారు. చివరికి వారు ఆశించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎంగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేట్టారు. కానీ, వ్యవసాయ రుణాల మాఫీకి ఆయన విధించిన 100 గడువు ఎప్పుడో ముగిసినా.. అధికార పీఠమెక్కి 5 నెలలు కావస్తున్నా ఆ హామీకి దిక్కు లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమకు ఇచ్చిన మాట ఏమైందని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను అడుగడుగునా నిలదీస్తున్నారు. మరోవైపు 6 గ్యారంటీలను ఎప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపితే తన ముఖ్యమంత్రి కుర్చీ కిందికి నీళ్లు వస్తాయన్న భయంతో రేవంత్ వణికిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఎక్కడికెళ్లినా ఆగస్టు 15లోగా రైతు రుణాలను మాఫీ చేస్తానంటూ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారు. ఈసారికి తనను నమ్మాలంటూ జనాన్ని వేడుకొంటున్నారు.
రెఫరెండమ్ ఏమైంది?
పార్లమెంట్ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ తన ప్రచార సభలతోపాటు ప్రెస్మీట్లలో ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పలువురు మంత్రులు సైతం తమ ఎన్నికల ప్రచార సభల్లో ఇదే మాట చెప్తూ.. రాష్ట్రంలో కనీసం 14 లోక్సభ సీట్లు గెలిచితీరుతామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ, తెలంగాణలో కాంగ్రెస్కు ఏమాత్రం విజయవకాశాలు లేవంటూ ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజా పరిస్థితిని ఇటీవల అధిష్ఠానానికి నివేదించినట్టు సమాచారం. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ పెద్దలు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను హుటాహుటిన హైదరాబాద్కు పంపారు. ఆ వెంటనే ఆయన సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఫ్లాష్ సర్వే నివేదికను వారి ముందుంచినట్టు తెలుస్తున్నది. రేవంత్ సర్కారుపై స్వల్ప వ్యవధిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని, ముఖ్యంగా రైతుభరోసా, రుణమాఫీ అమలు చేయకపోవడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి వేణుగోపాల్ వివరించి, తెలంగాణలో కాంగ్రెస్కు మెజార్టీ లోక్సభ సీట్లు లభించే పరిస్థితి లేదని చెప్పినట్టు వినికిడి. అందుకే రెఫరెండంపై సీఎం రేవంత్ ఇప్పుడు ఎక్కడా నోరు మెదపడం లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
సానుభూతి కోసం పాకులాట
ప్రస్తుతం సీఎం రేవంత్ ఓవైపు ఆగస్టు 15లోగా వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టేసి చెప్తూనే మరోవైపు ప్రజల నుంచి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ‘రైతు బిడ్డ సీఎం కావద్దా? పేదోడి బిడ్డ సీఎం కాకూడదా? మా ప్రభుత్వం పడిపోతుందా? మా ప్రభుత్వమే ఎందుకు పడిపోవాలి? కేంద్రంలో పదేండ్ల నుంచి కొనసాగుతున్న నరేంద్రమోదీ ప్రభుత్వం పడిపోతుందని ఎందుకు అనడం లేదు? నేను సీఎంగా ఉంటే ఓర్వలేకపోతున్నారా?’ అన్ని ప్రశ్నిస్తున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
పదే పదే పాలమూరుకు ఉరుకులు
సీఎం రేవంత్రెడ్డికి ఆయన సొంత జిల్లా మహబూబ్నగర్లో పార్టీ అభ్యర్థి వంశీచందర్రెడ్డి గెలుపు అగ్నిపరీక్షగా మారింది. అక్కడ ఫలితం అటు ఇటు అయితే తన సీఎం సీటుకే ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారు. అందుకే మహబూబ్నగర్లో వంశీచందర్ను ఓడించడం ద్వారా రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నదని పదే బహిరంగ సభల్లోనే ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్లోని తన ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతాయన్న భయంతో పదే పదే మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లి వంశీచందర్ను గెలిపించకపోతే తన పరువు పోతుందని వాపోతున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత రేవంత్ ఇలా ఇప్పటికే ఐదుసార్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించడం గమనార్హం.
భద్రాద్రి రాముడి సాక్షిగా..
నా తెలంగాణ రైతు సోదరులకు భద్రాద్రి రాముడి సాక్షిగా, మంత్రి తుమ్మల సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా. బరాబర్ రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటాం. మా వంద రోజుల పాలన చూడండి. మేం అమలు చేసిన పథకాలు చూసి 14 లోక్సభ స్థానాల్లో గెలిపించండి.
– ఈ నెల 19న మహబూబాబాద్లో సీఎం రేవంత్రెడ్డి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా..
ఎన్ని అవాంతరాలు ఎదురైనా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15 లోపు రాష్ట్రంలోని రైతులు అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.
– ఈ నెల 21న భువనగిరిలో సీఎం రేవంత్రెడ్డి
మేడారం, రామప్ప, వేయిస్తంభాలగుడి సాక్షిగా..
రామప్ప సాక్షిగా, మేడారం సమ్మక్క-సారక్క సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణమాఫీ చేస్తున్నాను. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్రావు సవాల్ విసిరారు. నేను కూడా ఈ వేదికపై నుంచి హరీశ్రావుకు చెప్తున్నా.. ఆగస్టు 15న నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండు.
– ఈ నెల 24న వరంగల్లో సీఎం రేవంత్
మెదక్ చర్చి, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా..
మెదక్ చర్చి, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నాను. ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంట సీజన్లో ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చి కొనే పూచీ కూడా నాదే.
– ఈ నెల 20న మెదక్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి