Harish Rao | ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సంగారెడ్డి ఏప్రిల్ (నమస్తే తెలంగాణ) : నీ సవాల్ నేను స్వీకరిస్తున్న.. రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 13హామీలను ఆగస్టు 15లోగా అమలు చెయ్యకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తవా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త.. ఉప ఎన్నికల్లో కూడా పోటీ చెయ్య. డొంక తిరుగుడు వద్దు.. దమ్ముంటే శుక్రవారం ఉదయం 10గంటలకు గన్పార్కులో అమరుల స్తూపం కాడికి రా.. అమరవీరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం’ అని సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ నామినేషన్ కార్యక్రమం, ఖమ్మంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్, ఆయాచోట్ల మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 15లోగా హామీలను అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్నదానికంటే కోట్ల మంది తెలంగాణ ప్రజలకు రుణమాఫీ, ఆరుగ్యారెంటీలు అందితే అదే తనకు సంతృప్తినిస్తుందన్నారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని, పదవుల త్యాగ తనకు కొత్తకాదని, గతంలో మంత్రి, రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. పదవుల కంటే తెలంగాణ ప్రజల ప్రయోజనమే తనకు ముఖ్యమని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతున్నదనే ఆపదమొక్కులు
‘ఆరు గ్యారెంటీలు, 13 హామీలు వంద రోజుల్లో అమలు చేయక కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతున్నది. అందుకే సీఎం రేవంత్రెడ్డి తొండి రాజకీయాలు చేస్తున్నడు.. ఆపదమొక్కులు మొక్కుతున్నడు’ ఎన్ని చేసినా ప్రజలు కాంగ్రెస్ను, రేవంత్రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని హరీశ్ దుయ్యబట్టారు. హామీలు అమలు చెయ్యిమంటే బీఆర్ఎస్ను రద్దు చేస్తరా అని రేవంత్ సవాల్ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సోనియా లేఖకు విలువ లేదా?
‘అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేస్తం, హామీల అమలు బాధ్యత నాది అని సోనియాగాంధీ స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది. ఆరు గ్యారెంటీలతోపాటు ఏడో గ్యారెంటీగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోజూ ప్రజలను కలుస్తరని సోనియా అన్నరు. వందరోజుల్లో హామీల అమలు అని అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. కాంగ్రెస్ పాలన వచ్చిన నాలుగు నెలలు కావస్తున్నా హామీల అమలు ఏమైంది? సోనియాగాంధీ రాసిన లేఖకు కూడా విలువలేదా?’ అని హరీశ్ ప్రశ్నించారు. ఆరింటిలో ఐదు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామని రేవంత్రెడ్డి చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత బస్సు మినహా అంతా తుస్సేనని హరీశ్ ఎద్దేవా చేశారు.
రాహుల్ కాంగ్రెస్ వేరు.. రేవంత్ కాంగ్రెస్ వేరు
‘రాహుల్ అదానీని చోర్ అంటుంటే రేవంత్ అదానీని మంచోడంటున్నడు.. రాహుల్ను భాయ్ అని, మోదీని బడే భాయ్ అంటున్నడు. అంటే మళ్లీ మోదీ ప్రధాని కావాలని రేవంత్రెడ్డి కోరుతున్నడా? రాహుల్గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్రెడ్డి కాంగ్రెస్ వేరా’ అని హరీశ్ ప్రశ్నించారు. తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రేవంత్ చెప్పుకొంటున్నాడని, ఆయన ఎప్పుడైనా బీజేపీలోకి వెళ్లే అవకాశముందన్నారు.
కుటుంబ సభ్యులకు టికెట్ కోసమే మంత్రుల ఆరాటం
ఖమ్మంలో ప్రజలు, రైతులు తాగు, సాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే.. ఇక్కడి మంత్రులు మాత్రం సమస్యలను గాలికి వదిలి తమ కుటుంబసభ్యులకు టికెట్ల కోసం ఢిల్లీ, బెంగుళూరుకు చక్కర్లు కొట్టారని హరీశ్ విమర్శించారు. కృష్ణా జలాలు రాకపోయినా గోదావరి జలాలతో ఖమ్మంజిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ రూపకల్పన చేసిందని గుర్తుచేశారు. గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ పార్టీ కిందికి దిగాలి అంటే ఖమ్మంలో నామా నాగేశ్వర్రావును ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఖమ్మంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.