సిద్దిపేట అర్బన్, మే 12 : కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజులు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్ మండలాల్లోని గ్రామాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. లాక్డౌన్లోనూ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండల పుల్లూరులో సర్పంచ్ పల్లె నరేశ్గౌడ్ లాక్డౌన్ను పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారికి రూ.100 ఫైన్ విధించారు.
ఇండ్లకే పరిమితమైన ప్రజలు
లాక్డౌన్ మొదటి రోజు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6 నుంచి 10 గంటల లోపే ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి ఇండ్లకు వెళ్లారు. కొద్దిమంది వాహనదారు లు 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపై వస్తుండడంతో పోలీసులు వారిని మందలించి, లాక్డౌన్పై అవగాహన కల్పించారు. ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాల వద్ద పరిస్థితులను సమీక్షించారు. గజ్వేల్ పట్టణంతోపాటు అన్ని గ్రామాల ప్రజలు లాక్డౌన్తో ఇండ్లకే పరిమితమయ్యారు. గజ్వేల్ ప్రభుత్వ ఏరియా దవాఖానతో పాటు ప్రైవేటు దవాఖానలు, మందుల దుకాణాలు తమ సేవలను కొనసాగించాయి. గజ్వేల్ బస్టాండ్లో బస్సులు అందుబాటులో ఉం డడంతో ప్రజలు సొంత గ్రామాలకు బయలుదేరారు.
పటిష్టమైన బందోబస్తు
గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 13మంది ఎఎస్ఐలతో పాటు హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, ఆర్మ్డ్ పోలీసు అధికారులు.155 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అత్యవసర పనులపై వెళ్లేవారు ఈపాస్ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలని ఏసీపీ నారాయణ సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వ్యాపారులు సహకరిచాలి
ప్రభుత్వం నిర్వహిస్తున్న లాక్డౌన్కు వ్యాపారులంతా సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ కోరారు. వ్యాపారులంతా ఉదయం 10గంటల వరకే వ్యాపారాలు నిర్వహించి మూసివేయాలన్నారు. సంతలు, బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి అమ్మకాలు నిర్వహించడానికి వీలులేదని హెచ్చరించారు. దుకాణ దా రులు ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే విపత్తుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
నిర్మానుష్యంగా మారిన హుస్నాబాద్
లాక్డౌన్ విధించడంతో హుస్నాబాద్ పట్టణంతోపాటు డివిజన్లోని అన్ని మండలాలు నిశబ్దంగా మారాయి. ఉదయం 6 నుంచి 10గంటల వరకు పట్టణంతో పాటు గ్రామాలు కొనుగోళ్లు, లావాదేవీలతో కళకళలాడగా 10గంటల తరువాత నిర్మానుష్యంగా మారాయి. 10గంటల వరకే ఆర్టీసీ బస్సులు నడిపించారు. మార్కెట్యార్డుతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. దవాఖానల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఏసీపీ మహేందర్, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిర్మానుష్యంగా గ్రామాలు..
లాక్డౌన్తో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో మద్దూరు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ప్రజలెవరూ బయట తిరగవద్దని హెచ్చరించారు. ధూళిమిటలో ఉప సర్పంచ్ పోతురాజు మధు ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రశాంతంగా లాక్డౌన్
దుబ్బాక నియోజకవర్గంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు సరుకులు కొనుగోలు చేసి తిరిగి వెళ్లిపోయారు. గ్రామాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల రాకపోకలు కొనసాగాయి. 10 గంటల తర్వాత వ్యా పారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. అనంతరం జనసంచారం లేక రహదారులు అన్ని నిర్మానుష్యం గా మారాయి. మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి దుబ్బాక పట్టణంలోని ప్రధాన వీధుల్లో మున్సిపల్ కార్మిక సిబ్బందితో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి..
కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. గ్రామాల్లో దుకాణా యజమానులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. మిరుదొడ్డి, భూంపల్లి ఎస్సైలు శ్రీనివాస్, సర్దార్ జమాల్ పోలీసు సిబ్బందితో మండలకేంద్రంతోపాటు గ్రామాల్లో గస్తీ చేపట్టారు.రాయపోల్ మండల కేంద్రంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పది గంటల తర్వాత లాక్డౌన్ విధంచడంతో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించారు.దౌల్తాబాద్ మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరం ఉన్నవారికి పోలీస్ సిబ్బంది అనుమతి ఇచ్చి పంపించారు.
లాక్డౌన్కు వ్యాపారుల మద్దతు
చేర్యాల మండలంతో పాటు మద్దూ రు, కొమురవెళ్లి, ధూళిమిట్ట మండలాల్లో తొలిరోజు లాక్డౌన్ను పకడ్పందీగా అమలు జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వర్తక, వాణిజ్య వర్గాలు తమ వ్యాపారాలను కొనసాగించాయి. అత్యవసర సేవలు మాత్రం యాథావిధిగా కొనసాగాయి. గ్రామాల్లో లాక్డౌన్ను ఏఎస్సై కక్కెర్ల రమేశ్ పర్యవేక్షించారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి:జిల్లాకేంద్రంలో సీపీ జోయల్ డెవిస్ పర్యటన
లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని పోలీష్ కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని ముస్తాబాద్, నర్సపురం, అం బేద్కర్, ఎల్లమ్మదేవాలయం, సుభాష్రోడ్, గాంధీరోడ్, రాజీవ్ రహదారి, రూరల్ పోలీసుస్టేషన్, కోమటిచెరువు, ప్రభుత్వ దవాఖాన చౌరస్తాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి దుకాణా లు తెరిచినవారితో మాట్లాడి దుకాణాలను బంద్ చేయించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా లాక్డౌన్ కొనసాగుతున్నదన్నారు. 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.