తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని, రాష్ట్రంలో ఇప్పుడు వ్యవసాయం పండుగలా మారిందని, రైతులకు మంచి రోజులు వచ్చాయని, వారిదే ఇక రాజ్యమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రామచంద్రాపూర్లో తొలిసారి ఆయిల్పామ్ సాగుకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రైతులు వరి సాగు తగ్గించి ఆయిల్పామ్, పప్పు దినుసులు, పట్టుపరిశ్రమ, లాభదాయక పంటల వైపు దృష్టిసారించాలన్నారు. ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు, డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నర్మెటలో పామాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేస్తున్నాయని, వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం పున :సమీక్షించుకోవాలని కోరారు. ఈసారి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో భూమికి బరువయ్యేంత పంటలు పండాయని, చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని మంత్రి సూచించారు.
-సిద్దిపేట, జూన్ 05( నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. రైతులు పట్టుపంచెలు కట్టుకునే రోజులను సీఎం సాకారం చేస్తున్నారు. యాసంగి పంటలు గింత బలువుగా పండుతాయని మనం కలలో కూడా అనుకోలేదు. ఈ యాసంగిలో బోరుబావుల ఎండలే.. బాయిల నీళ్లు దంగలే… గతంలో కన్నా రెట్టింపు పంటలు పండినయి. ఎకరానికి ఒక్కో రైతు 35 నుంచి 40 క్వింటాళ్ల పంట తీసిండ్రు. గతంలో 500 ఫీట్ల నుంచి నీరు తీసి పారిస్తే దాంట్లో ఉండే లవణాలత ఫ్ల్లోరైడ్ కారణంగా మనకు పంట దిగుబడి తగ్గింది. ఇవ్వాళ గోదావరి నీళ్లు రావడంతో బాగా పంట పండింది. నాణ్యమైన కరెంట్, గోదావరి నీళ్లు, సకాలంలో విత్తనాలు, ఇవన్నీ కలిసి భూమికి బరువయ్యేలా పంట పండిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రామచంద్రాపూర్లో రైతు నర్సింహారెడ్డి వ్యవసాయ భూమిలో ఆయిల్పామ్ సాగుకు మంత్రి హరీశ్రావు శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్తో కలిసి మొదటి ఆయిల్ పామ్ మొక్కను మంత్రి హరీశ్రావు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇవాళ చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగు పడతాయని కేసీఆర్ చెప్పిన మాట నేడు నిజమైందన్నారు. రైతు బిడ్డకే పిల్లనిస్తమనే కాలం తిరిగి రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగిందన్నారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను తలదన్నే విధంగా తెలంగాణలో ధాన్యం పండిందన్నారు. భూమికి బరువైన పంట పండిందని, దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనుగోళ్లు చేస్తలేదని, కేవలం తెలంగాణ మాత్రమే రైతులకు మద్దుతు ధర ఇస్తూ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నదని తెలిపారు.ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులేత్తేసిందన్నారు.
పామాయిల్కు డిమాండ్…
ఏటా దేశం 9లక్షల మిలియన్ టన్నుల పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నదని, పామాయిల్ పంటకు మంచి డిమాండ్ ఉందని రైతులు సాగుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేలా.. అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధ్దంగా ఉందన్నారు. మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
నర్మెటలో పామాయిల్ పరిశ్రమ..
నంగునూరు మండలం నర్మెటలో గెలల నుంచి పామాయిల్ తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ పరిశ్రమకు అవసరం అయ్యే 105 ఎకరాల భూమిని కేటాయించామన్నారు. దీంతో జిల్లా రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇవాళ మామిడి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. అందుకే పామాయిల్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. పామాయిల్ పెట్టే రైతులకు డ్రిప్ సబ్సిడీ కావాలని సీఎం కేసీఆర్ను కోరగానే, వెంటనే ఆమోదించినట్లు తెలిపారు.రైతుల కోసం నాలుగు రకాల లాభాలు చేస్తున్నామన్నారు. గుంత, ఎరువు, డ్రిప్, వాచ్ అండ్ వార్డు కింద కూలీ ఇస్తున్నామని తెలిపారు. ఎకరా డ్రిప్ మీద రూ 14 వేల సబ్సిడీని ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. రూ. 300 మొక్కకు రైతు కట్టేది రూ.33 అని చెప్పారు. ఎరువులు నాలుగేండ్ల పాటు ఎకరానికి రూ. 2వేల చొప్పున 8 వేలను ఉచితంగా అందిస్తారని తెలిపారు.నాలుగేండ్ల పాటు అంతర పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. ఉపాధి హామీలో గుంత, కర్ర కట్టడానికి, గడ్డి తీయడానికి డబ్బులు ఇస్తుందన్నారు. పామాయిల్ తోటలు సాగు చేసే రైతులు కేవలం రూ.6 వేలు కడితే సరిపోతుందని, మిగతా రూ.1.35 లక్షలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుందని మంత్రి వివరించారు.
మీ కొడుకులాగా సహకరిస్తా..
సిద్దిపేట జిల్లా ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలన్నదే నా కోరిక, దీనికి ప్రజాప్రతినిధులు సహకరించాలి. పామాయిల్ సాగుచేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అధికారుల దృష్టికి తీసుకువస్తే మీ కన్నకొడుకులాగా నేను మీకు సహకరిస్తానని మంత్రి హరీశ్రావు చెప్పారు. 200 మంది పామాయిల్ రైతులకు ప్రోత్సాహం అందేలా, ప్రతి 1,000 ఎకరాలకు ఒక అధికారి ఉంటారని తెలిపారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగు మొదలు పెట్టినట్లు, ఈ యేడు 3 వేల ఎకరాలకు ఇస్తున్నట్లు, మొదటి విడతలో వెయ్యి ఎకరాలు, రెండో విడత దసరా పండుగ సమయంలో 2 వేల ఎకరాలు పెట్టాలన్నారు. వచ్చే సంవత్సరం 7 వేల ఎకరాలు పెట్టాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. వెయ్యి ఎకరాల్లో నేడు 160 ఎకరాల్లో రైతులు మొదలు పెట్టినట్లు తెలిపారు. ఆయిల్పామ్ తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న మరికొంత మంది రైతులను ఆశ్వరావుపేటకు పంపిస్తామని చెప్పారు. ములుగు, రంగనాయక సాగర్ వద్ద రెండు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నట్లు చెప్పారు. దీని సాగుకు అన్నిరకాలు భూములు అనుకూలం అన్నారు. అనంతరం పామాయిల్ సాగుచేసే160 మంది రైతులకు సంబంధించి ప్రొసీడింగ్ను అందించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్రెడ్డి, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, నాయకులు జాప శ్రీకాంత్రెడ్డి, వేముల వెంకట్రెడ్డి, దువ్వల మల్లయ్య, సోంరెడ్డి, పురంధర్, కిష్టారెడ్డి, జైపాల్రెడ్డి వివిధ గ్రామాల నాయకులు, రైతులు , ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.