మద్దూరు, సెప్టెంబర్ 25 : సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కొండాపూర్ మల్లన్నగుట్ట చారిత్రక ఆధారాలకు నెలవుగా నిలుస్తున్నది. పచ్చని పొలాల మధ్యలో ఉన్న ఎత్తయిన మల్లన్న గుట్ట కొన్ని శతాబ్దాల క్రితం నుంచి ఓ పవిత్ర పుణ్యస్థలంగా వాసికెక్కింది. గుట్టపై మల్లన్న స్వామి కొలువుదీరడంతో మల్లన్నగుట్టగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఎత్తయిన గుట్టపై ఉన్న ప్రాచీన శివాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఇక్కడ పవిత్రమైన రెండు నీటి గుండాలు ఉన్నాయి. ఈ నీటి గుండాల్లో కాలాలకతీతంగా నీల్లు ఉంటాయి. ఈ గుండాల్లో లభించిన నీటిని కొండాపూర్తో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఔషధ జలంగా భావిస్తున్నారు. ఈ నీళ్లు తాగిన దీర్ఘవ్యాధిగ్రస్తులు కోలుకున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ నీటిని తమ పంట పొలాలపై చల్లుకోవడంతో మంచి దిగుబడులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నీటి గుండాల చెంతనే అత్యంత సుందరంగా చెక్కిన శివలింగం ఉంది. మల్లన్న గుట్టకు సర్వాయి పాపన్నకు సంబంధమున్నట్టు పౌరాణిక కథలు వ్యాప్తిలో ఉన్నాయి.
గుట్టపై నుంచి కింది వరకు క్వార్ట్ గీత..
గుట్టపై నుంచి కింది దాకా కనిపించే తెల్లటిది, మధ్య మధ్యలో నలుపు, పచ్చని క్వార్ట్ గీత ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. గుట్ట గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘గుట్టపై నుంచి కింది భాగం వరకు గుట్టకు రక్తనాళంగా గీత కనిపిస్తున్నది. అలాగే, గుట్టపై అనేక రాతి సిరలున్నాయి. ఇవి గ్రానైట్ ఏర్పడడంలో భాగంగా చివరిదశలో అంర్గతంగా వచ్చి బయటపడి ఉండవచ్చని పలువురు చెబుతున్నారు. ఇలాంటివి ఎక్కువ మటుకు రాతి ఉపరితలం మీద సమాంతరంగా విస్తరిస్తుంటాయి. అక్కడక్కడ పక్కకు జరిగి ఉండవచ్చు. చిన్నచిన్న స్థానభ్రంశాలతో ఈ రాతి సిరలు కనిపిస్తుంటాయి. భూగర్భంలో సహజసిద్ధంగా రూపొందే క్రమంలో శిలల్లోని ప్లూటాన్ రకానికి చెందిన బహిర్గతాలు కనిపించే రూపవైవిధ్యంలో భాగమే ఈ రాతి సిరలు. సాధారణంగా పైన్ గ్రెయిన్డ్, డామినెంట్ బ్లాక్ ప్లాకీ మినరల్స్ కారణంగా బూడిదరంగులో కనిపిస్తుంటాయి. వీటి వయస్సు 280 నుంచి 250 కోట్ల సంవత్సరాలుగా ఉంటాయి’ అని శ్రీనివాస్ తెలిపారు. తన పరిశోధనకు చకిలం వేణుగోపాల్రావు, శ్రీరామోజు హరగోపాల్లు సహకరించారని చెప్పారు.
గుట్టపై కొలువుదీరిన గట్టుమల్లన్న..
రెండు గుట్టల మధ్య గిరిజన తండా ఉంది. ఈ తండాలో సుమారు 60 నుంచి 70 నివాసాలున్నాయి. తండాకు ఎడమ వైపులో ఉన్న గుట్టపై శివాలయంతో పాటు ప్రాచీన ఆనవాళ్లు ఉండగా కుడి వైపు ఉన్న గుట్టపై మల్లన్న స్వామి స్వయంభూగా వెలసి, గట్టు మల్లన్నగా భక్తులకు దర్శనిమిస్తున్నాడు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో ఏటా శివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గిరిజన ప్రజలు గట్టు మల్లన్న స్వామిని తమ ఇలవేల్పుగా కొలుస్తుంటారు.