సిద్దిపేట : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం పూలే 195వ జయంతి వేడుకలను సిద్దిపేట పాత బస్టాండ్ కూడలిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్త o రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కె రాజనర్సు లతో కలిసి పూలే నిలువెత్తు విగ్రహానికి పుష్పాంజలి ఘటిం చారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అంటూ ఫూలే సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నాయన్నారు. బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందనీ తెలిపారు. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పూలేకు నిజమైన నివాళులు అని పేర్కొన్నారు.