సిద్దిపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. ప్రధాన రోడ్లతో పాటు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లను రెండు వరుసలుగా అభివృద్ధి చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగు పరిచింది. వంతెనల మరమ్మతులు, కొత్తగా బిడ్జిలు నిర్మించింది. తాజాగా రోడ్ల మరమ్మతులకు భారీగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రహదారులు సరికొత్త రూపు సంతరించుకోనున్నాయి. గత వానకాలంలో దెబ్బతిన్న రహదారులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 3376.70 కిలోమీటర్లకు గాను బీటీ రోడ్ల పునరుద్ధరణకు రూ.71.42 కోట్లు, ఎఫ్డీఆర్కు గాను రూ.9.11కోట్లు, మొత్తం రూ. 80.53 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రోడ్లను మరమ్మతులు చేయనున్నారు. ఈ నిధులను కేవలం మరమ్మతులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు నిధులు మంజారు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయనున్నారు. వీటిలో సిద్దిపేట జిల్లాలో 1378.83 కిలోమీటర్ల మరమ్మతు పనులకు రూ.3569.66 (లక్షలు), సంగారెడ్డి జిల్లాలో 1173.59 కిలోమీటర్ల మరమ్మతులకు రూ.2275.18 (లక్షలు), మెదక్ జిల్లాలో 824.28 కిలోమీటర్లకు రూ. 2208.78 (లక్షలు) మంజూరయ్యాయి.