సిద్దిపేట అర్బన్ : జిల్లాలోని రైతులు ఆయిల్పామ్ తోటల సాగుపై దృష్టి సారించాలని జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ అన్నారు. మంగళవారం ఆమె జిల్లా పరిషత్ 2, 3, 4వ స్థాయి సంఘాలైన వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, విద్య వైద్యం సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత జిల్లాలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉందని, భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
జిల్లాలో ఆయిల్పామ్ తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక దృష్టి సారించారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విరివిగా సాగు చేయాలన్నారు. మంత్రి ప్రోత్సాహం, జిల్లా అధికారుల కృషితో ఇప్పటివరకు సుమారు వెయ్యి ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలను నాటడం జరిగిందన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ను సాగు చేయాలన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. సమావేశంలో జడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, సుకూరి లక్ష్మి, శెట్టి మల్లేశం, కొండల్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సలీం, రమేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.