ప్లాస్ట్టిక్ రహిత సిద్దిపేట పట్టణమే లక్ష్యం
నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్ట్టిక్ వాడకం నిషేధం
ఇప్పటికే వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు
మూడు బృందాలతో కట్టుదిట్టంగా నిత్యం తనిఖీలు
వార్డుకు ఒకటి చొప్పున 34 స్టీల్ బ్యాంకుల ఏర్పాటు
సిద్దిపేట, జూలై 31 : సిద్దిపేట పట్టణాన్ని ప్లాస్ట్టిక్ రహితంగా తీర్చిదిద్దాలనే మంత్రి హరీశ్రావు ఆలోచనలకు అనుగుణంగా మున్సిపల్ పాలకవర్గం మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం అమలులోకి తెస్తున్నది. స్వచ్ఛ పట్టణంగా సిద్దిపేట ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక అవార్డులు గెలుచుకుంది. సమర్థవంతగా చెత్త సేకరించడంతో పాటు హరితహారం అమలులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటింది. తాజాగా ప్లాస్టిక్ మహమ్మారిని పట్టణం నుంచి తరిమివేయడమే లక్ష్యంగా ప్లాస్ట్టిక్పై సమరాన్ని మోగించింది. నేటి నుంచి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్ట్టిక్ను నిషేధాన్ని అమలు చేస్తున్నది. ప్లాస్ట్టిక్ నిషేధంపై ఇప్పటికే వ్యాపారులకు అధికారులు అవగాహన కల్పించారు. పట్టణంలో ఏ సమావేశం జరిగినా ప్లాస్ట్టిక్తో కలిగే అనర్థాలను మంత్రి హరీశ్రావు ప్రజలకు వివరిస్తూ వారిలో చైతన్యం కలిగిస్తున్నారు. తనను శుభకార్యాలకు పిలిచేవారు ప్లాస్ట్టిక్ వాడితే హాజరుకానని మంత్రి వారికి చెబుతున్నారు. కూరగాయలకు ప్లాస్టిక్ కవర్లకు బదులు బట్ట సంచులు, మాంసాహారం తెచ్చుకునేందుకు స్టీల్ డబ్బాలు వాడాలని సూచిస్తున్నారు.
చెత్త నుంచి విముక్తికి..
సిద్దిపేట పట్టణంలో ప్రతిరోజూ తడి చెత్త 26.80 టన్నులు, పొడి చెత్త 16.50, హానికరమైన చెత్త 1.20 టన్నులు, సిల్ట్ట్ 6.85, బయోమెడికల్ వేస్ట్ 1.40 టన్నులు ఉత్పత్తవుతుండగా, ఇందులో 1.60 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హాని జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పట్టణంలో ప్లాస్ట్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలు చేసేందుకు మున్సిపాలిటీ సంకల్పించింది. దీనికోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్, ముగ్గురు సిబ్బంది ఉంటారు. ప్లాస్ట్టిక్ వస్తువుల వాడకంపై నిఘా పెట్టి, వీరు దాడులు చేస్తారు. ఒకసారి వాడిన ప్లాస్ట్టిక్ బాటిళ్లను వేసేందుకు వీలుగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, నెక్లెస్ రోడ్డు, కోమటి చెరువు వద్ద బాటిల్ తదితర ఆకారాల్లో డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు.
34 స్టీల్ బ్యాంకులు..
ప్లాస్ట్టిక్ వాడకాన్ని నివారించేందుకు సిద్దిపేట పట్టణంలోని వార్డుకు ఒకటి చొప్పున 34 స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. స్టీల్ బ్యాంకుల్లో శుభకార్యాలకు అవసరమైన ప్లేట్లు, గిన్నెలు, గ్లాస్లు, ఇతర వస్తువులు అందుబాటులో ఉంచారు. వీటి నిర్వహణను ఆయా వార్డులోని మహిళా స్వయం సంఘాలకు అప్పగించారు. శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా, బయట టెంట్హౌస్ల్లో దొరికే రేటు కన్నా నామమాత్రపు రేటుకే వీటిని స్టీల్ బ్యాంకుల్లో అందిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వాడకాన్ని కాస్తన్నా తగ్గించడానికి వీలవుతున్నది.
అందరూ సహకరించాలి..
ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంతో నేటి నుంచి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్ట్టిక్ వాడకాన్ని నిషేధించాం. మంత్రి హరీశ్రావు ఆదేశానుసారం సిద్దిపేట పట్టణాన్ని ప్లాస్ట్టిక్ రహితంగా మార్చేందుకు అందరూ సహకరించాలి. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు వస్తున్నాయి.