Drone | డ్రోన్ గురించి ఒకప్పుడు ఆశ్చర్యంగా చదివాం. ఆ తర్వాత దూరం నుంచి చూశాం. ఇప్పుడు ఏదో ఓ సందర్భంలో ఉపయోగించుకుంటున్నాం. వివాహాది శుభకార్యాలకు డ్రోన్ కెమెరా ఉండాల్సిందే. క్రిమిసంహారకాల పిచికారీ కోసం ఇప్పుడిప్పుడే డ్రోన్ల వాడకం మొదలైంది. ఈ హవా ఇక్కడితో ఆగిపోదు. డ్రోన్.. పహరా సమయంలో సైనికుడు అవుతున్నది, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అవతారం ఎత్తుతున్నది, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనసున్న వాలంటీర్లా సేవలు అందిస్తున్నది.. ప్రాణాలు కాపాడుతున్నది. సెల్ఫోన్ తర్వాత.. అంతగా జనానికి దగ్గరవుతున్న ఆవిష్కరణ ఇదే కావచ్చు.
డ్రోన్.. మహాభారతంలో ద్రోణా చార్యుడంత కీలకమైపోయింది. బంధువుల పెండ్లిలో డ్రోన్ కెమెరాలు వాడారనో, పక్క ఊరి రైతులు డ్రోన్తో క్రిమిసంహారకాలు పిచికారీ చేశారనో.. ఏదో ఓ రూపంలో ఆ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మారుమూల ప్రాంతాలకు ఔషధాలను పంపడానికి కూడా అక్కరకు వస్తున్నాయివి. భూముల సర్వేకు, కొలతలకు, పహరాకు.. ఒకటేమిటి ప్రతిచోటా, ప్రతిరంగంలో డ్రోన్ రంగంలో దిగాల్సిందే. సందేహం లేదు.. రానున్నది డ్రోన్ యుగమే. డ్రోన్ అనేది ఓ రోబో లాంటిది. సాంకేతిక పరిభాషలో అన్మాన్డ్ ఏరియల్ వెహికిల్ (యూఏవీ) అని పిలుస్తారు. కచ్చితత్వం, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే శక్తి దీని ప్రత్యేకత. హెలికాప్టర్తో పోలిస్తే చవక కూడా. వచ్చే రెండేండ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద డ్రోన్ తయారీదారు అవుతుందని అంచనా. ఇప్పటికే మనం డ్రోన్ల వినియోగంలో అగ్రదేశాలకు దీటుగా నిలుస్తున్నాం.
ఎంత చేయితిరిగిన ఫొటోగ్రాఫర్ అయినా.. నేల మీదినుంచే ఫొటోలు తీస్తాడు. మహా అయితే స్టాండ్ మీద నిలబడి దృశ్యాన్ని బంధిస్తాడు. ఆకాశంలోకి ఎగరలేడు. ఆ పని డ్రోన్ చేయగలదు. చేస్తున్నది కూడా. డ్రోన్ కెమెరా వచ్చాక ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో సృజన కొత్తపుంతలు తొక్కుతున్నది. ఛాయాగ్రాహకులకు కొత్త కోణం దొరికింది. దృశ్యానికి సమగ్రత వచ్చింది. రాజకీయ నాయకుల ర్యాలీలు, సభలు, సమావేశాలను మరింత బాగా కండ్లకు కడుతున్నారు. కస్టమర్లకు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్నారు. దీనివల్ల చాలా తలనొప్పులు తగ్గాయి. ఎక్కడెక్కడి నుంచో పెద్దపెద్ద క్రేన్లు, స్టాండ్లు తెప్పించాల్సిన అవసరం లేకుండాపోయింది. గతంలో, అంతెత్తు మీదినుంచి షూట్ చేస్తున్నప్పుడు.. ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలైన వారూ ఉన్నారు. లక్షల విలువైన కెమెరా చేజారితే అంతే సంగతులు. డ్రోన్ను తరలించడం పెద్ద కష్టమేం కాదు. ఓ మోస్తరు సూట్కేస్ సరిపోతుంది. రియల్ ఎస్టేట్ అడ్వర్టయిజింగ్ రంగంలోనూ డ్రోన్లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. వార్తా పత్రికలు, ఛానెళ్లు సైతం చాలా సందర్భాలలో డ్రోన్ల సాయం తీసుకుంటున్నాయి. ప్రత్యేకించి ప్రకృతి విపత్తుల సమయంలో అవి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా పనిచేస్తున్నాయి.
నిర్మాతలు డ్రోన్ సృష్టికర్తకు పాదాభివందనం చేయాల్సిందే. ఆ ఒక్క ఎక్విప్మెంట్తోనే చాలా కష్టాలు తీరిపోతున్నాయి. కోట్ల రూపాయల ఖర్చులు తప్పిపోతున్నాయి. ప్రీప్రొడక్షన్ దశలో.. లొకేషన్లు ఎంపిక చేసుకోవడం, పర్మిషన్లు తీసుకోవడం.. చాలా సులభం అయిపోతుంది. షూటింగ్ సమయంలో లక్షలకు లక్షలు పోసి హెలికాప్టర్ అద్దెకు తీసుకోవాల్సిన ఇబ్బందీ లేదు. యుద్ధాలు, కార్ చేజింగ్లు, అగ్ని ప్రమాదాల్లో హీరో సాహసాలు.. తదితర ఘట్టాలను చవకగా షూట్ చేసుకోవచ్చు. ఏ హిమాలయ సౌందర్యాన్నో వెండితెర మీద చూపించాలంటే.. డ్రోన్ కెమెరాను మించిన మాధ్యమం లేదు. న్యూస్ రీల్, షార్ట్ ఫిల్మ్ చేయడానికి, అభివృద్ధి పనుల డాక్యుమెంటరీలు తీయడానికి డ్రోన్ కెమెరానే ఆశ్రయిస్తున్నారు.
రైతన్నలకు మంచి రోజులు వచ్చాయి. తెలంగాణలో నీటి వనరులు పుష్కలం. ఉన్న ఎకరంలోనో అర ఎకరంలోనో ఏదో ఒకటి పండించుకుంటున్నారు. వలసలు ఆగిపోయాయి. గ్రామీణులలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. వీటన్నిటి ఫలితంగా కూలీల కొరత ఏర్పడింది. ముఖ్యంగా క్రిమిసంహారకాల పిచికారీకి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రైతులు డ్రోన్ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి డ్రోన్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ డ్రోన్లకు గిరాకీ పెరిగింది. వివిధ కంపెనీలు ప్రత్యేకంగా తయారుచేసి విక్రయిస్తున్నాయి. వీటిలోనే పిచికారీ మందు నిల్వచేసేందుకు ప్లాస్టిక్ డబ్బాతోపాటు, స్ప్రే పంపులూ ఉంటాయి. మందు నింపి.. రిమోట్ సాయంతో డ్రోన్ను ఆపరేట్ చేయగలిగతే చాలు. కూర్చున్న దగ్గరినుంచే పొలం మొత్తం పిచికారీ చేయవచ్చు. సమయం కలిసొస్తుంది. రసాయనం మూలమూలకూ వెళ్తుంది. కానీ ఇక్కడో పరిమితి ఉంది. చాలామంది రైతులు అంతగా చదువుకోని వాళ్లే. డ్రోన్ నిర్వహణ వారికి కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. రిపేరు వస్తే.. అంతే సంగతి. ఆ పరిమితిని అధిగమించడానికి కొన్ని కంపెనీలు రైతులతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సర్వీసింగ్, మరమ్మతు బాధ్యత తామే తీసుకుంటున్నాయి. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేర్పుతున్నాయి. కొంతమంది ఉత్సాహవంతులు డ్రోన్లను అద్దెకిస్తూ ఉపాధి పొందుతున్నారు. దీనివల్ల రైతు సొంతంగా డ్రోన్ కొనాల్సిన అవసరం ఉండదు. ఓ నిరుద్యోగికి నాలుగురాళ్లు సమకూరినట్టూ ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ జోడించిన డ్రోన్ కెమెరాలు పంటలను ఆశించే చీడపీడలనూ కనిపెట్టి రైతుకుహెచ్చరికలు పంపుతున్నాయి. పంట ఏ దశలో ఉంది, కోతకు ఎప్పుడు సిద్ధం అవుతుంది, ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నదీ బేరీజు వేస్తున్నాయి.
భూకంపాలు, వరదలు, తుఫాన్లు.. ప్రకృతి కన్నెర్రజేసిన ప్రతిసారీ మనిషి పసిపిల్లాడిలా వణికిపోతున్నాడు. ఆ సవాళ్లకు తలవంచుతున్నాడు. ఆ కష్టనష్టాలను మౌనంగా భరిస్తున్నాడు. వరదల్లో చిక్కుకున్న అమాయకులను, తుఫాను ధాటికి సర్వం కోల్పోయిన నిరాశ్రయులను ఆదుకుని, ఆసరా అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయినా, ఆ వేగం సరిపోవడం లేదు. ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్లు గాలిలో ఎగరలేవు. ఇలాంటప్పుడు, డ్రోన్లను మించిన ప్రత్యామ్నాయం లేదు. ఆహారం, మందులు, దుప్పట్లు.. వేగవంతంగా చేరవేస్తున్నాయి. శిథిలాల మధ్య చిక్కుకున్న వారి వివరాలు, వరదనీటి మధ్యలోనో బిక్కుబిక్కుమంటూ నిల్చున్నవారి ఆనవాళ్లు ఇట్టే కనిపెడుతున్నాయి. త్రీడీ మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్, ఏరియల్ మానిటర్ టెక్నాలజీలు ఆ శోధనలో సాయపడుతున్నాయి. అస్సాం వరదల సమయంలో ఐఐటీ గువాహటి విద్యార్థులు ‘డ్రోన్ టెక్ ల్యాబ్’ అనే స్టార్టప్ సాయంతో జిల్లా యంత్రాంగాలకు సాంకేతిక సాయం అందించారు.
దేశ సరిహద్దుల పహరాలో సైనికులకు డ్రోన్ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మంచుకొండల్లో విధులు నిర్వర్తించే సైనికులకు డ్రోన్లు నిత్యావసరాలను అందిస్తున్నాయి. డ్రోన్ నిఘా నేత్రాలు చొరబాటుదారులను ఇట్టే పట్టేస్తున్నాయి. సరిహద్దుల అవతలికి వెళ్లి.. శత్రుదేశాల స్థావరాల సమాచారాన్నీ సాక్ష్యాలు సహా అందిస్తున్నాయి. అవసరమైతే ఆయుధాలను మోసుకెళ్లి అగ్నివర్షం కురిపిస్తున్నాయి. ఒక డ్రోన్ వేయిమంది సైనికులకు సమానమని కేంద్ర సర్కారూ ఆమోదిస్తున్నది. అదే సమయంలో డ్రోన్ టెకాల్నజీ శత్రుదేశాలకు వరంగానూ మారుతున్నది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్.. డ్రోన్ల సాయంతో ఆయుధాలను చేరవేస్తూ.. దొరికిపోయిన ఉదంతాలు అనేకం. దొంగచాటుగా దేశంలోకి ప్రవేశిస్తున్న డ్రోన్లను గుర్తించి.. దారి మళ్లించే యాంటీ డ్రోన్ సాంకేతికతను సిద్ధం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
అంతర్గత శాంతిభద్రతల నిర్వహణలోనూ పోలీసు శాఖలకు డ్రోన్లు అండగా నిలుస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మందుపాతరలు ఓ తీవ్ర సమస్య. ఆ పేలుళ్లకు వేలమంది పోలీసు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు, వికలాంగులుగా మారారు. ఆ నష్టాన్ని నివారించడానికి.. డ్రోన్ కెమెరాల సాయం తీసుకుంటున్నారు. భద్రతా దళాల వాహనాలు బయల్దేరడానికి కాస్త ముందే డ్రోన్లు రంగంలోకి దిగుతున్నాయి. ఆ మార్గంలోని మందుపాతరలను, ఆయుధ డంప్లను గుర్తించి సమాచారం అందిస్తున్నాయి. వాటిని నిర్వీర్యం చేయడంలోనూ సహకరిస్తున్నాయి. ధర్నాలు, హర్తాళ్లు, ఊరేగింపులు, మార్చ్లు జరుగుతున్నప్పుడు.. ఏ వైపునుంచి నిరసనకారులు చొచ్చుకొస్తున్నదీ.. డ్రోన్లతో గుర్తిస్తున్నారు. దీంతో, ఎక్కడికక్కడ కంచెలు వేసి నిలువరిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ తలకుమించిన భారంగా మారిన బెంగళూరులాంటి నగరాలలో.. డ్రోన్ సాయం తీసుకుంటున్నారు. వాటికి కృత్రిమ మేధను అనుసంధానం చేయడం ద్వారా.. రహదారుల మీద రద్దీని గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు.
వేసవికాలంలో అటవీప్రాంతంలో కార్చిచ్చు ఓ తీవ్ర సమస్య. ఒక్క అగ్గిపుల్ల చాలు.. అడవంతా బుగ్గికావడానికి. అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగి.. ఫైర్ ఇంజిన్లను రప్పించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అమూల్య సంపద బూడిదైపోతుంది, అనేక వన్యమృగాలు ప్రాణాలు కోల్పోతాయి. డ్రోన్ కెమెరాల పహరాతో ఈ నష్టాన్ని నివారించ వచ్చని నిపుణులు గుర్తించారు. అత్యాధునిక సాంకేతికత జోడించిన డ్రోన్ ఓవైపు కెమెరాలా పనిచేస్తూ ఫొటోలు తీయడమే కాదు.. మంటల్ని గుర్తించి రసాయన వర్షం కురిపించి చల్లార్చగలదు కూడా. మంటలు మొదలైన ప్రాంతాన్ని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా కచ్చితంగా గుర్తించే శక్తి కూడా డ్రోన్లకు ఉంది. వాయు కాలుష్యాన్ని బేరీజు వేయడానికి కాలుష్య నియంత్రణ సంస్థలు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి.
శాంతిభద్రతల కారణంగా ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో డ్రోన్ వినియోగంపై అనేక ఆంక్షలు విధించింది. లేకపోతే, ఇప్పటికే న్యూస్పేపర్లు, పాలు, ఇ-కామర్స్ సంస్థల నుంచి సరకుల డెలివరీ.. తదితర సేవలన్నీ డ్రోన్ల ద్వారానే జరిగిపోయేవి. అనేక తయారీ సంస్థలు స్టాక్ లెక్కింపు, స్టాక్ తనిఖీలో డ్రోన్ సాయం తీసుకుంటున్నారు. నిర్మాణ రంగంలోనూ డ్రోన్ ప్రాధాన్యం పెరిగిపోతున్నది. ముఖ్యంగా సెల్లార్ తవ్వకం ఓ పెద్దపని. ఇందుకే ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతున్నది. ఆ పనులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు డ్రోన్లను రంగంలో దించుతున్నాయి. భూగర్భంలోకి డ్రోన్లను పంపి.. ఫొటోలు తీయించడం ద్వారా ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఓ నిర్ధారణకు వస్తున్నారు. ఖనిజాల వెలికితీత, బొగ్గు తవ్వకాలలో డ్రోన్లు ఎంతగానో సహకరిస్తున్నాయి.
డ్రోన్ టెక్నాలజీ మన వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకు వస్తున్నదనే విమర్శలూ ఉన్నాయి. అతి సూక్ష్మమైన డ్రోన్ కెమెరాలు నేరుగా మన పడక గదిలోకి కూడా వచ్చేయగలవు. మన బాత్రూమ్నూ కవర్ చేయగలవు. మన ప్రైవేటు సంభాషణలను రికార్డు చేయగలవు. సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం చేయగలవు. ఓరకంగా చెప్పాలంటే.. బతుకు బజారున పడినట్టే. కొన్నిసార్లు డ్రోన్లు పట్టుతప్పి.. ఏ వాహనాలకో గుద్దుకుని ప్రమాదాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. వీటికి ఎవరు బాధ్యత వహించాలి? అందులోనూ రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో.. ఒక్క డ్రోన్ చాలు పెను ఉత్పాతం సృష్టించడానికి. అలా అని, పరిమితులకు భయపడి ప్రయోజనాలను దూరం చేసుకోలేం. ఏ సాంకేతికతకు అయినా బొమ్మాబొరుసూ ఉంటాయి. మంచిని పెంచుకుంటూనే, చెడును పరిహరిస్తూ ముందుకు సాగడమే జీవితం. డ్రోన్ల వినియోగమూ ఇందుకు మినహాయింపు కాదు. అంతమాత్రాన కొత్త సాంకేతికతను చిన్నబుచ్చలేం. డ్రోన్కు దీటైన ప్రత్యామ్నాయం దొరికేవరకూ డ్రోన్ను కండ్లకు అద్దుకుని వాడుకోవాల్సిందే. ప్రతి మార్పుతోనూ ఏదో ఓ ముప్పు ఉండనే ఉంటుంది. దాన్ని నామమాత్రం చేయడంలోనే మనిషి మహా నేర్పరి!
మనదేశంలో డ్రోన్లను నడిపించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొన్ని నిబంధనలు రూపొందించింది. అన్ని రకాల డ్రోన్లను తప్పనిసరిగా డీజీసీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లైసెన్స్ తీసుకోవాల్సిందే. సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా ఈ అనుమతులు లభిస్తాయి. లైసెన్స్ తీసుకునే వ్యక్తికి 18 ఏండ్లు నిండి ఉండాలి. డీజీసీఏ నుంచి అనుమతి పొందిన సంస్థలో శిక్షణ పొంది, రాత పరీక్షలో పాసైన వారికి 10 ఏళ్ల కాల పరిమితి కలిగిన రిమోట్ పైలట్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. కానీ, తాజా నిబంధనల ప్రకారం నానో డ్రోన్లతోపాటు, నాన్ కమర్షియల్ మైక్రో డ్రోన్లు నడిపేందుకు ఎలాంటి లైసెన్స్ అవసరం ఉండదు. డ్రోన్ శిక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ డ్రోన్ అకాడమీని కూడా ఏర్పాటుచేసింది.
☞ ఎనభై కేజీల మనిషిని సునాయాసంగా గమ్యానికి చేర్చగల డ్రోన్లు సిద్ధం అవుతున్నాయి. అంటే, డ్రోన్ వ్యక్తిగత రవాణా వాహనంగానూ మారిపోనుంది.
☞ రెజినాల్డ్ జెన్నీ అనే హాలివుడ్ నటుడు 1935 ప్రాంతంలో తొలి డ్రోన్కు ప్రాణం పోశాడని అంటారు.
☞ మోనోకాప్టర్, బైకాప్టర్, ట్రైకాప్టర్.. వాటికి బిగించిన రొటేటింగ్ బ్లేడ్స్ ఆధారంగా డ్రోన్స్కు పేర్లు పెట్టారు.
☞ రెండేండ్ల క్రితం.. మూడువేల పైచిలుకు డ్రోన్లను ఒకేసారి ఆకాశంలోకి పంపడం ద్వారా.. జెనిసిస్ అనే లగ్జరీ ఆటోమోటివ్ బ్రాండ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించింది.
☞ ఒసామా బిన్ లాడెన్ను డ్రోన్ కెమెరాలే పట్టించాయని అమెరికా అధికారికంగా ప్రకటించింది.
☞ గగనతలం సంగతి అటుంచితే, అండర్వాటర్ డ్రోన్లు సముద్ర గర్భంలోకి చొచ్చుకెళ్లి అరుదైన ఫొటోలను తీసుకొస్తున్నాయి.
☞ డ్రోన్ సాయంతో ఇంటర్నెట్ సౌకర్యాన్ని మారుమూల ప్రాంతాలకూ విస్తరించవచ్చని గుర్తించారు. ఆ దిశగా ఏర్పాట్ల్లు జరుగుతున్నాయి.
☞ పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టడానికి వాసనను పసిగట్టే డ్రోన్లనూ తయారుచేసే ప్రయత్నంలో ఉన్నారు శాస్త్రవేత్తలు.
☞ రెండేండ్ల క్రితం.. జమ్మూ ఎయిర్పోర్టు మీద రెండు బాంబులు పడ్డాయి. పాకిస్థాన్ సరిహద్దు నుంచి ఓ డ్రోన్ వాటిని మోసుకొచ్చింది. భారత్పై జరిగిన తొలి డ్రోన్ దాడి అదే.
☞ ప్రారంభంలో ఆర్మీకే పరిమితమైన డ్రోన్లను ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. డ్రోన్ నడిపేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. మొదట్లో 2.4 గిగాహెడ్జ్కు ఎక్కువ, 2.4 గిగాహెడ్జ్కు తక్కువ కెపాసిటీతో రెండు రకాల డ్రోన్లు ఉండేవి. వీటిలో 2.4 గిగాహెడ్జ్ కంటే తక్కువ డ్రోన్లను నడిపేందుకే అనుమతి ఇచ్చేవారు. ఆ తర్వాత నిబంధనలను సడలించి వీటికీ పచ్చజెండా ఊపారు.
☞ కొత్తగా నానో, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ .. ఐదు రకాలుగా విభజించారు. నానో డ్రోన్ 250 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని నడపడానికి ఎలాంటి అనుమతులూ అవసరం లేదు. ఇది 50 అడుగుల ఎత్తు వరకూ వెళ్తుంది. అంతకుమించిన సామర్థ్యం ఉన్నా.. ఆ మేరకే నడిపించాల్సి ఉంటుంది. విద్యా సంబంధమైన అవసరాలకు ఉపయో గించే డ్రోన్లకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదు.
☞ మైక్రో డ్రోన్ 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు ఉంటుంది. స్మాల్ డ్రోన్ 2 కిలోల నుంచి 25 కిలోల బరువు ఉంటుంది. మీడియం డ్రోన్ 25 కిలోల నుంచి 250 కిలోల బరువు ఉంటుంది. లార్జ్ డ్రోన్ 150 కిలోలకు మించి ఉంటుంది. వీటిని నడపడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), సీఏఏ అనుమతులు తీసుకోవాలి. అనుమతితో పాటు రెండేళ్ల వ్యవధి కలిగిన అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్ (యూఏసీపీ) లైసెన్స్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జారీ చేస్తారు. ఈ సంఖ్యను డ్రోన్పై అతికించాల్సి ఉంటుంది. ఎక్కడ కొనుగోలు చేశారు, ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలతోపాటు డ్రోన్ లైసెన్స్ తీసుకునే వ్యక్తి ఆధార్కార్డ్ వంటి పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. స్థానిక పోలీసుల అనుమతులూ తప్పని సరి. అనుమతులు లేకుండా డ్రోన్ను ఉపయోగిస్తే పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలు, అణువిద్యుత్ కేంద్రాలు, సరిహద్దు రేఖలు, విమానాశ్రయాల దగ్గర నిషేధం విధించారు. ఈ నిబంధనలను కొద్దిపాటి మార్పులతో వివిధ రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి.
…? కె.నవీన్కుమార్, నారాయణపేట
“Naya Mall | ఈ పెన్ను ధర రూ.22.74 లక్షలు.. అంతలా దీని స్పెషాలిటీ ఏంటో !!”
“Naya Mall | కళ్ల కింద చారలతో వయసు పైబడినట్టు కనిపిస్తున్నారా? మీకోసమే ఈ ట్రిక్”