న్యూయార్క్ : చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్పదనే అంచనాల నడుమ ఐబీఎం (IBM) సీఈవో అరవింద్ కృష్ణ బాంబు పేల్చారు. రాబోయే ఐదేండ్లలో కొన్ని బ్యాక్ ఆఫీస్ విధులను ఏఐతో రీప్లేస్ చేస్తామని చెప్పారు. కంపెనీలో కొన్ని రోల్స్ను తొలగించి వాటిని కృత్రిమ మేధతో భర్తీ చేస్తామని అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు. ఏఐ రాకతో మానవ వనరులను రీప్లేస్ చేస్తారని చెప్పుకొచ్చారు.
అమెజాన్ సహా పలు కంపెనీలు హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగులను తొలగించి వారి స్ధానంలో ఏఐని వినియోగించేందుకు సన్నద్ధమవుతుండగా ఐబీఎం చేసిన ప్రకటన టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. ఈ ఏడాది ఆరంభంలోనూ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో పలు కఠిన నిర్ణయాలు ప్రకటించింది. దాదాపు 4000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ ఏడాది జనవరిలో కంపెనీ వెల్లడించింది. ఇక ఐదేండ్ల వ్యవధిలో తమ కంపెనీలో ఏఐ, ఆటోమేషన్ కారణంగా 30 శాతం ఉద్యోగులు కొలువులు కోల్పోతారని ఐబీఎం సీఈవో చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ఏఐ రీప్లేస్మెంట్తో 7800 ఉద్యోగాలు కనుమరుగవనున్నాయి.
ఇక నూతన ఉత్పాదకత చర్యలు, సామర్ధ్య పెంపుతో 2024 సంవత్సరాంతానికి కంపెనీ 200 కోట్ల డాలర్లను ఆదా చేస్తుందని ఐబీఎం సీఎఫ్వో జేమ్స్ కవనగ్ తెలిపారు. ఇక ఏఐకి నియంత్రణ యంత్రాంగం ఉండాలని, దీనిపై ప్రభుత్వ జోక్యం అవసరమని ఎలన్ మస్క్ సహా పలువురు టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్లు కోరుతున్నారు. ఇక ఏఐతో కొన్ని కొలువులను కోల్పోయినా ఉద్యోగులకు దీనిద్వారా సమయం ఆదా అవుతుందని, అయితే టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు దీనిపై నియంత్రణ ఉండాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
Read More
ChatGpt | ఏఐతో ఉత్పాదకత పెరిగినా కొలువుల కోత తప్పదు : టాటా సన్స్ చైర్మన్