Google | కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేసినప్పుడు గమనించారా? గూగుల్ క్రోమ్, గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ వన్, మ్యాప్స్, యూట్యూబ్ వంటి పలు యాప్స్ ముందుగానే ఇన్స్టాల్ చేసి వస్తాయి. వీటిలో మనకు అవసరం లేని యాప్స్ ఉన్నా తప్పనిసరిగా వాటిని ప్రీ ఇన్స్టాల్ చేసి ఇస్తుంది. ముఖ్యంగా డీఫాల్ట్ బ్రౌజర్గా గూగుల్ క్రోమ్ మాత్రమే ఉంటుంది. దాన్ని మార్చుకోవడానికి వీలుండదు. కానీ ఇకపై అది కుదరదు. సీసీఐ వేసిన యాంటీ ట్రస్ట్ కేసులో ఓడిపోవడంతో ఆండ్రాయిడ్ సిస్టమ్లో భారీ మార్పులు చేసేందుకు గూగుల్ సిద్ధమైంది.
భారత్లో సుమారు 97 శాతం స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీదనే నడుస్తున్నాయి. దీన్ని అదునుగా తీసుకుని మొబైల్ తయారీ కంపెనీలతో గూగుల్ భారీ ఒప్పందం చేసుకుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆరోపించింది. ఈ ఒప్పందం ప్రకారం అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో తమ యాప్స్ను ప్రీ ఇన్స్టాల్ చేయిస్తుందని పేర్కొంది. కచ్చితంగా గూగుల్ యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉండటంతో ఆ మొబైల్ వినియోగదారులకు ఎక్కువ ప్రకటనలు చూపించే అవకాశం లభిస్తుందని తెలిపింది. ఇలా అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తూ.. తన మార్కెట్ను దుర్వినియోగం చేయడంపై గూగుల్ కంపెనీకి సీసీఐ రూ.1337 కోట్లు ( 161 మిలియన్ డాలర్ల ) దాదాపు నెల క్రితం జరిమానా విధించింది. తక్షణమే వీటిని ఆపేయాలని సీసీఐ ఆదేశించింది.
కానీ సీసీఐ ఆదేశాలను సవాలు చేస్తూ గూగుల్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీసీఐ చెప్పిన మార్పులు చేయాలంటే 1100 కంటే ఎక్కువ పరికరాల తయారీదారులు, వేల సంఖ్యలో యాప్ డెవలపర్లతో ఒప్పందాలు మార్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కానీ సుప్రీంకోర్టు గూగుల్కు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. సీసీఐ ఆదేశాలను పాటించాల్సిందేనని పేర్కొంది. దీంతో సీసీఐతో సహకరిస్తామని గూగుల్ తెలిపింది. ఈ మేరకు గూగుల్ ప్లేలో పలు మార్పులు తీసుకొస్తుంది. దీని ప్రకారం గూగుల్ సెర్చ్కు బదులు యూజర్లకు నచ్చిన బ్రౌజర్ను డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే పలు గూగుల్ యాప్స్ను ఇంతకుముందులాగే ప్రీ ఇన్స్టాల్ చేసి ఇవ్వనుంది.
Micorsoft | నిలిచిన మైక్రోసాఫ్ట్ సేవలు.. భారత్ సహా పలు దేశాల్లో సర్వీసులు డౌన్