హైదరాబాద్,ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్.. ఉద్యోగ పరీక్షల దరఖాస్తు ఫీజుల పేరిట నిరుద్యోగ యువతతో వ్యాపారం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మండిపడ్డారు. ఎస్సై పోస్టుకు రూ.1,500, కానిస్టేబుల్ పోస్టుకు రూ.1,000 దరఖాస్తు ఫీజులను వసూలు చేస్తూ నిరుద్యోగులను దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు. అధికారంలోకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఎలాంటి దరఖాస్తు ఫీజులు వసూలు చేయబోమని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల నోటిఫికేషన్లలో కోతలు తెచ్చి రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 13 వేల ఉద్యోగాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఒకవైపు తెలంగాణ డీజీపీ రాష్ట్రంలో ఏకంగా 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారని గుర్తుచేశారు. అన్ని ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 7 వేల పోలీస్ ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
నియమాక శారీరక పరీక్షలో లాంగ్జంప్ విషయంలో కొత్తగా తెచ్చిన నిబంధనలను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని సుధీర్రెడ్డి కోరారు. లాంగ్జంప్ విషయంలో గతంలో గాంధీభవన్లో ధర్నాలు చేసిన నాయకులే నేడు అధికారంలోకి వచ్చారని, అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లాంగ్జంప్ 4 మీటర్లు కాకుండా 3 మీటర్ల 4 అంగుళాలకు పరిమితం చేయాలని గాంధీభవన్ ముందు ధర్నా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేసిందని, కానీ అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించిందని సుధీర్రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్లలో గతంలో ఉన్న వయో పరిమితి ప్రకారమే పేర్కొన్నదని విమర్శించారు. పోలీస్ అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ నోటిఫికేషన్లను సవరించాలని డిమాండ్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. పాత జిల్లాల ప్రాతిపదికనే హైదరాబాద్ కొత్త కమిషనరేట్ల పరిధిలో ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.