హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు, తర్వాత ధరణిపై అడ్డగోలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిని నిరూపించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఎంత లోతు తవ్వినా, ఎన్ని కమిటీలు వేసినా, ఎంత ప్రయత్నించినా ధరణిలో తప్పు లు జరిగాయని నిరూపించేందుకు ఆధారాలు లభించలేదని తెలిసింది. ఇప్పుడు ధరణి సక్రమమేనని బయటకు పొక్కితే అసలుకే ఎసరు వస్తుందని, ఇకపై ఆసత్య ప్రచారాలు సాగవనే ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో నెలకొన్నట్టు వినిపిస్తున్నది. అందువల్ల మరికొన్ని రోజులపాటు ధరణిపై అరోపణలు, అసత్య ప్రచారాలను కొనసాగించాలని సర్కార్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ధరణి వివాదం ఎప్పుడూ ప్రజల్లో ఉండేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ధరణిపై చేసిన ఆరోపణలను నిజం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ముందుగా ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించింది. ఆ తర్వాత తాజాగా జూలై ఒకటిన ఒక కమిటీ వేసింది. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులతో ప్రత్యేకంగా మరో కమిటీ వేసింది. ఈ రెండూ కాదని, 15 రోజుల్లోనే మరో కమిటీ వేయాలని ఇటీవల క్యాబినెట్ నిర్ణయించింది. స్పెషల్ ఎంక్వైరీ టీం(ఎస్ఈటీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ధరణిపై అధికారికంగా మూడు కమిటీలు వేశారు.
అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ బాధ్యతను కేరళ సంస్థకు అప్పగించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. తాజాగా ఈ సంస్థ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. అయితే ఆ నివేదికలో ఏం ఉందనే అంశాన్నిగానీ, ధరణిలో జరిగిన తప్పులను గానీ ప్రభుత్వం ఇప్పటివరకు బహిరంగపరచలేదు. అయితే ఈ నివేదికపై సీఎంవో, రెవెన్యూశాఖ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడే కొన్ని పత్రికలకు లీకులు ఇచ్చారు. లీకుల ద్వారా ధరణిపై ఆ రిపోర్టులో ఏదో జరిగిపోయినట్టు వార్తలు వండి వార్చారు.
ఒకవేళ ఆ లీకుల ప్రకారం, ధరణిలో అక్రమాలు జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో తేలితే ప్రభుత్వమే స్వయంగా ఆ నివేదికను ప్రజలముందు పెట్టొ చ్చు కదా? స్వయంగా సీఎం గానీ, రెవెన్యూశాఖ మంత్రిగానీ ప్రెస్మీట్ పెట్టి మరీ వివరించొచ్చు కదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అలాకాకుండా దొంగచాటుగా లీకులు ఇవ్వడం వెనుక అర్థం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ఫోరెన్సిక్ నివేదికలో ఏమీ బయటపడలేదని, అందుకే ఆ నివేదికను బయటపెట్టకుండా లీకుల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధరణిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు జూలై ఒకటిన తొమ్మిదిమంది ఐఏఎస్లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను 15 రోజుల్లోగా అందించాలని ఆదేశించారు. ఆ మేరకు జూలై 15న ఈ కమిటీ తన నివేదికను అందించాలి. ఇప్పటివరకు నివేదికకు అతీగతి లేదు. నిజానికి ఇప్పటివరకు ఆ కమిటీ ఒక్కసారి కూడా భేటీ కాలేదని తెలిసింది. ఇక ఈ కమిటీలో కీలకమైన రెవెన్యూశాఖ సెక్రటరీకి చోటు లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్కు కూడా చోటులేదు. ఇలా కీలకమైన రెండు శాఖల ఉన్నతాధికారులకు చోటు ఇవ్వకుండా కమిటీ ఏం పని చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఐఏఎస్ల కమిటీతో ఏమీ తేలదనే విషయం ప్రభుత్వానికి తేలిపోయింది. అందుకే మరో కమిటీని తెరపైకి తీసుకొచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా దీనికి స్పెషల్ ఎంక్వైరీ టీం(సెట్) అని పేరు పెట్టింది. అయితే ఈ కమిటీలో ఎవరెవరుంటారు, వీళ్లు ఏం చేస్తారు, ఎప్పుడు నివేదిక ఇస్తారనే అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.
ఓవైపు రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువుతో రైతులు అల్లాడుతున్నారు. చేయూత ఇవ్వాల్సిన సర్కార్ చేతులెత్తేసింది. ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనను డైవర్షన్ చేయడానికి, ధరణిపై ఇప్పుడున్న వ్యతిరేకతను అలాగే కొనసాగించేలా చేసేందుకు కమిటీల పేరుతో ఎత్తుగడలు వేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని రోజులపాటు ఇలాగే కమిటీలు వేస్తూ, నివేదిక పేరుతో జాప్యం చేస్తూ వీలైనప్పుడుల్లా లీకులు ఇస్తూ, ధరణిపై నిందలు వేస్తూ, బురదజల్లే కార్యక్రమాలకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నివేదికలు బయటపడితే ధరణిపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగిపోతాయి. అప్పుడు కాంగ్రెస్ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయం తేటతెల్లమవుతుంది.