జహీరాబాద్, డిసెంబర్ 7 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ కృషితో పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. జహీరాబాద్ సమీపంలో ఉన్న ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్జ్ ఏర్పాటుకు 12,600 ఎకరాల భూమిని సేకరించేందుకు సర్వే చేయించింది. మొదటి విడుతలో 3500 ఎకరాల భూమిని సేకరించి, పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ట్రైటాన్ కంపెనీ ప్రతినిధులు నిమ్జ్లో పరిశ్రమ ఏర్పాటుకు భూమిని పరిశీలించి, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. నిమ్జ్లో 150 ఎకరాల్లో ట్రైటాన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ.2100 కోట్లు పెట్టుబడులు పెడుతామన్నారు. పరిశ్రమతో 25వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ట్రైటాన్ పరిశ్రమలో విద్యుత్ వాహనాలు ఉత్పత్తి చేయనున్నారు. దీంతో పాటు రక్షణ రంగానికి చెందిన వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1000 కోట్లతో 511 ఎకరాల్లో సమీకృత రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ(ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెసిలిటీ) వారు మానవరహిత యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, నౌకాదళ యంత్రాలు, రాడార్లు ఉత్పత్తి చేసేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. ఈ పరిశ్రమల్లో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. వీటితో పాటు ఇటీవల హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో జర్మనీకి చెందిన వాహన పనిముట్ల సంస్థ లైట్ ఆటో జీఎంబీహెచ్ నిమ్జ్లో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నది. జర్మనీకి చెందిన వాహన పనిముట్ల పరిశ్రమ 100 ఎకరాల్లో రూ. 1500 కోట్లు పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమల్లో ప్రత్యేకంగా 9 వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. ఇలా వరుసగా అంతర్జాతీయ సంస్థలు జహీరాబాద్ నిమ్జ్కు తరలివస్తుండడంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా పురోగతి సాధించనున్నది.
ప్రైవేట్ సంస్థలకు మౌలిక వసతులు..
నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి 3500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి టీఎస్ఐఐసీకి అప్పగించింది. నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయలు కల్పించేందుకు టీఎస్ఐఐసీ సర్వేచేసి, ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. పరిశ్రమల ఏర్పాటుకు రోడ్లు, విద్యుత్, నీరు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు విదేశీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీలు మంజూరు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నది.
మూడు భారీ పరిశ్రమలు..
అంతర్జాతీయంగా పేరెన్నిక గన్న ట్రైటాన్, వీఈఎం టెక్నాలజీస్, జర్మనీకి చెందిన లైట్ ఆటో జీఎంబీహెచ్ కంపెనీలు నిమ్జ్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. రూ.18,100 కోట్ల పెట్టుబడులతో నిమ్జ్లో 761 ఎకరాల్లో ఈ సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి. మూడు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 54 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో జహీరాబాద్లో పారిశ్రామికంగా గుర్తింపు పొందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలంగా పారిశ్రామిక విధానం అమలు చేస్తుండడంతో దేశవిదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. నిమ్జ్లో మౌలిక సదుపాయాలతో పాటు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నది. జర్మనీకి చెందిన లైట్ ఆటో జీఎంబీహెచ్ సంస్థ రూ. 1500 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేసి స్టీలు, అల్యూమీనియం కన్నా తక్కువ బరువు, అధిక నాణ్యత కలిగి ఉన్న ఉత్పత్తులు ఉత్పత్తి చేయనున్నది.