సంగారెడ్డి : ప్రతి గ్రామం పచ్చదనంతో కనువిందు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చిత్తశుద్దితో అమలు చేస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి మండలం కలప్గూర్ గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతం పరిధిలో 14ఎకరాల్లో మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ మంజుల అధ్యక్షతన ఎంపీ ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అలాగే పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామం అంగడిపేటలో అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మణాలు చేపట్టాలని గ్రామస్తులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎక్కువ అడవులు కలిగిన ప్రాంతంలో వర్షాలు పుష్కలంగా పడుతాయని, ఈ విషయం శాస్త్రవేత్తలు, పెద్దలు చెప్పిన నిజాలని అన్నారు.
హరితహారంలో మొక్కలు నాటి అడవులు పెంచేందుకు ముఖ్యమంత్రి కృషి అమోఘమన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమం చేపట్టి రోడ్డుకు ఇరువైపుల పచ్చని హారంలా కనిపించేలా మొక్కలు నాటడంతో భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలితో పాటు వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. ముఖ్యంగా మంజీర ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అనగానే సందర్శకులతో కిటకిటలాడుతుందని, అలాంటి ప్రాంతంలో 14ఎకరాల్లో మొక్కలు నాటి పచ్చని హారం పెంచితే అధిక సంఖ్యలో సందర్శకులు వస్తారన్నారు.
పక్షులు, కోతులు అడవులలో ఆహారం దొరకకా గ్రామాల్లోకి వస్తున్నాయని, ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి హరితహారంలో పండ్లు, ఫలాలు ఇచ్చే మొక్కలు నాటి సంరక్షణ చేస్తే పక్షులు, కోతుల బెడద తప్పుతుందన్నారు. త్వరలో మరో 20-30ఎకరాలలో మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. మంజీరా ప్రాంతం పచ్చని చెట్లతో అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభాపరిమణామన్నారు.
టూరిజం హబ్గా తయారు చేస్తా
జిల్లా కేంద్రం సంగారెడ్డికి సమీపంలో ఉన్న మంజీరా ప్రాజెక్టును టూరిజం హబ్గా మార్చేందుకు కేంద్ర టూరిజం మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఎంపీ అన్నారు. అలాగే గ్రామంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేషన్లో మొక్కను నాటారు. మంజీరా ప్రాజెక్టు గేటు ముందు నుంచి మెగా ప్లాంటేషన్ వరకు పంచాయతీరాజ్శాఖ నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపడతామన్నారు. అందుకు నివేదికలు సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే త్వరలో మంజీర ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడనున్నదని, కాళేశ్వరం నీటితో ప్రభుత్వం నింపేందుకు చర్యలు చేపడుతుందన్నారు.
ప్రాజెక్టును సందర్శించిన ఎంపీ
మెగా ప్లాంటేషన్లో మొక్కలు నాటిన అనంతరం సమీపంలోని మంజీర ప్రాజెక్టును ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. వర్షకాలం ప్రారంభంలో పడిన వర్షాలకు పై బాగం నుంచి వచ్చిన వరదతో ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయని అధికారులు వివరించారు. ఆగస్టులో వర్షాలు పడితే పైబాగం నుంచి వరద వస్తే నిండే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికి తాగు నీటికి ఇబ్బందులు ఉండవని అధికారులు ఎంపీకి తెలిపారు. ప్రాజెక్టు పంపింగ్ విధానం, నీటి నిల్వను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు సునీత, కొండల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ముస్తాఫా, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎంపీడీఓ ఆకుల రవీందర్, ఎంపీఓ మహేందర్రెడ్డి, ఎపీఎం వెంకట్, నాయకులు విజయేందర్రెడ్డి, రవి, రాంరెడ్డి ప్రభుగౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.