రామచంద్రాపురం, జూన్ 10 : బల్దియా డివిజన్లు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం భారతీనగర్ డివిజన్లోని బొంబాయికాలనీలో రూ.48 లక్షలతో సీసీ రోడ్డు, మ్యాక్ సొసైటీలో రూ.18లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్ నగరం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నగరానికి శివారు ప్రాంతాలైన భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్లు అభివృద్ధి విషయంలో నంబర్వన్ స్థానంలో నిలుస్తున్నాయని చెప్పారు. ప్రతి డివిజన్లో థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. సాకిచెరువు, రాయసముద్రం చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ బాలయ్య, డివిజన్ అధ్యక్షుడు దేవేంద్రాచారి, నాయకులు నగేశ్, పాపయ్యయాదవ్, నర్సింహ, గిరి, అజీముద్దీన్, కృష్ణగౌడ్, సత్యనారాయణ, రాజేందర్, అంజిరెడ్డి, సురేశ్, గౌస్, కృష్ణ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
త్వరలో మంచినీటి పైపులైన్ పనులు
పటాన్చెరు, జూన్ 10 : నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచినీటి పైపులైన్ పనులు అతిత్వరలో ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, హెచ్ఎండబ్ల్యూఎస్ సీజీఎం దశరథరెడ్డి, జనరల్ మేనేజర్ బలరాం రాజుతో కలిసి పట్టణంలో పర్యటించారు. పైపులైన్ నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పైపులైన్ తరచు లీకేజీలు ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం పటాన్చెరు పట్టణ పోలీస్స్టేషన్ నుంచి టోల్గేట్ వద్ద గల జలమండలి కార్యాలయం వరకు నూతన పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రెండో దశలో నక్కవాగు నుంచి పోలీస్స్టేషన్ వరకు పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.