ఈ నెల 10 తర్వాత సర్వే చేయనున్న బృందాలు
జిల్లాకు చేరుకున్న సర్వే అధికారులు
రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదికలు
నివేదిక అందిన వెంటనే పనులు ప్రారంభం
సంగారెడ్డి జూన్ 6 (నమస్తే తెలంగాణ) : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల సర్వే పనులు ఈ నెల 10వ తేదీ తర్వాత ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో కలిసి రెం డు ఎత్తిపోతల పథకాల సర్వే పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంగమేశ్వ, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. మలన్నసాగర్ నుంచి ప్యాకేజీ 17, 18, 19 పనుల ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టులోకి తరలిస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు ఎగువ భాగంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించి సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని 3.40లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నుంచి 23 టీఎంసీల జలాలను పంటపొలాలకు అందజేస్తారు. ప్రభుత్వం రెండు ఎత్తిపోతల పథకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నది.
రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణం పనులను చేపట్టేందుకు డిటెయిల్డ్ ప్రా జెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధం చేసేందుకు రెండు సర్వే సంస్థలను ఎంపిక చేసింది. అధికారుల సమాచారం మేరకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సాయిగణేశ్ అసోసియేట్స్ సంస్థ చేపట్టనున్నది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్.వి.కన్సల్టెంట్ అసోసియేట్స్ అనే సంస్థ చేపడుతున్నది. ఈ రెండు సంస్థలు మూడు నెలల్లో సర్వే పనులు పూర్తి చేసి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ప్రభుత్వానికి అందజేయనున్నది. సీఎం కేసీఆర్ రెండు నెలల్లో డీపీఆర్ అందజేయాలని సర్వే సంస్థలకు సూచించినట్లు తెలుస్తున్నది. దీంతో సర్వే సంస్థలు వేగంగా సర్వే పనులు పూర్తి చేసి రెండు నెలల్లో డీపీఆర్లను ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతున్నాయి. డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అందిన వెంటనే ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల ప్రారంభించనున్నది.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు పూర్తయితే జిల్లాలోని 3.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. జిల్లాలో ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు సాగునీరు అం దుతున్నది. గోదావరి జలాలను సింగూరులోకి తరలించి మరింత ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇం దులో భాగంగా మల్లనసాగర్ నుంచి సింగూరు వరకు ప్రధాన కాల్వల నిర్మాణం ప్యాకేజీ 17, 18, 19, 19A ద్వారా జరుగుతుంది. ఈ పనులు పూర్తయితే సింగూరు ప్రాజెక్టులోకి 20 టీఎంసీలకుపైగా గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయి. 20 టీఎంసీల పైగా జలాలు రావడంతో మంజీరాలో నీటి లభ్యత పెరుగుతున్నది.సింగూరు ప్రాజెక్టు ఎగువ భాగంలో మంజీరా నదిపై కొత్తగా సంగమేశ్వ, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మంజీరా నది కుడివైపు నిర్మించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా 15టీఎంసీ నీటిని కాల్వల ద్వారా పంటపొలాలకు తరలిస్తారు. సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మంజీరా నది ఎడమవైపు నిర్మించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్, మనూరు, నాగల్గిద్ద, సిర్గాపూర్, కల్హేర్, కంగ్టి మండలాల్లోని 1.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు పూర్తయితే సంగారెడ్డి జిల్లాలో 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
10 తర్వాత సర్వే పనులు ప్రారంభం
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు ఈ నెల 10 తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను దక్కించుకున్న రెండు సంస్థలు సర్వేకు సన్నద్ధమవుతున్నాయి. జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లను ఇది వరకే సిద్ధం చేశారు. డిజైన్ల ఆధారంగా సర్వే సం స్థలు పూర్తిస్థాయిలో సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
సర్వేకు అవసరమైన ఆధునాతన సర్వే యం త్రాలు, ఇంజినీర్లు, సాం కేతిక సిబ్బంది, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు తరలిస్తున్నాయి. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సాయిగణేశ్ అసోసియేట్స్ సంస్థ ఇంజినీర్లు జహీరాబాద్, అందోలు నియోజకవర్గంలోని ప్రతిపాదిత రిజర్వాయర్, పంప్హౌజ్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ సిస్థం స్థలాలను పరిశీలించినట్లు తెలుస్తున్నది.
సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రిజర్వాయర్, పంప్హౌజ్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ సిస్థంకు సంబంధించిన సర్వేతోపాటు 188 కిలో మీటర్ల ప్రధాన కాల్వ, 500 కిలో మీటర్ల బ్రాంచి కెనాల్కు సంబంధించి సర్వే చేయనున్నారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్థం (డీజీపీఎస్) ద్వారా సర్వే చేయనున్నారు. ఇందుకు కోసం 25 డీజీపీఎస్ యంత్రాలను వినియోగించనున్నారు. మునిపల్లి మండలంలో కంకోల్ సమీపంలో 10వ తేదీ తర్వాత మంత్రి హరీశ్రావు సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభించేందుకు ఆర్.వి.కల్సల్టెంట్ అసోసియేట్స్ సంస్థ సన్నద్ధమవుతున్నది. ఈ సంస్థ సైతం డీపీజీఎస్ ద్వారా సర్వే పనులు చేపట్టనుంది. మంత్రి హరీశ్రావు త్వరలోనే బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రారంభించనున్నారు.