నెల రోజులుగా.. సెలవులు లేకుండా సేవల్లోనే..
జిల్లా వ్యాప్తంగా 120 మంది అధికారులు, 930 మంది స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఎంలు
ఆక్సిజన్ కొరత లేకుండా జిల్లాలో 130 బెడ్ల ఏర్పాటు: జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు
మేడ్చల్, మే 3(నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తోంది. వైద్య సిబ్బంది సెలవులు లేకుండా కరోనా కట్టడికి నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు, సిబ్బంది నెల రోజులుగా సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అత్యవసరమైతే తప్ప వైద్య సిబ్బంది సెలవులు తీసుకోకుండా విధులను నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 120 మంది వైద్యాధికారులు, 930 మంది స్టాఫ్ నర్సులు, ఎంఎన్ంలు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్లో నియోజకవర్గాలలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానలు వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు వెల్లడించారు.
ఆక్సిజన్ కొరత లేకుండా పర్యవేక్షణ
ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలలో కరోనా వ్యాధి సోకిన వారికి అవసరమయ్యే అక్సిజన్ కొరత లేకుండా మేడ్చల్ జిల్లా వైద్యశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలలో చికిత్స పొందుతున్న వారి వివరాలను సేకరిస్తూ వారికి అవసరమయ్యే అక్సిజన్ అందుబాటులో ఉందా? లేదా? అన్నా విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలలో ప్రతిరోజు కరోనా టెస్టులను చేస్తూ చికిత్సలను అందజేస్తున్నారు. అత్యవసరమైతే గాంధీ దవాఖానలకు తరలిస్తున్నారు.
అత్యవసర సేవలకు అంబులెన్సులు..
జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవలకు ఏడు ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేశారు. చికిత్స నిమిత్తం ఇతర దవాఖానలకు తరిలించేందుకు ప్రత్యేక అంబులెన్సులను వినియోగించనున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.