హవేళిఘనపూర్, జూన్ 27: గాజిరెడ్డిపల్లి గ్రామం.. ఒక్కప్పుడు బూర్గుపల్లి పంచాయతీలో అనుబంధ గ్రామంగా కొనసాగడంతో అన్ని రంగాల్లో అభివృద్ధికి వెనుకంజలో ఉండేది. దాదాపు 1300 జనాభా కలిగిన గ్రామం ఎలాంటి నిధులు మంజూరు లేక ఎక్కడి సమస్యలు అక్కడే మూలనపడ్డాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుతో పాటు పల్లె ప్రగతిలో యెనలేని అభివృద్ధ్ది చేసినందుకు ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సీసీ రోడ్డుతో తీరిన ఇబ్బందులు
వర్షాకాలంలో వానలకు గ్రామంలోని రోడ్లు బురదమయంగా మారేవి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.25 లక్షల నిధులతో సీసీ రోడ్డ నిర్మించారు. అంతేకాకుండా గ్రామంలో పలు చోట్ల మురుగు నీటి కాల్వలు కూరుకుపోగా, కాల్వల నిర్మాణ్నా చేపట్టారు. గతంలో ఎన్నడు జరుగలేని పనులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపడుతుండడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ పనులకు మహర్దశ
ప్రభుత్వం పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిత్యం గ్రామంలో సేకరించిన చెత్త ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పంచాయతీ పారిశుధ్య సిబ్బంది నిత్యం రోడ్లను ఊడ్చి మురుగునీటి కాల్వలను పరిశుభ్రం చేస్తుండడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. పల్లె ప్రకృతి వనం నిర్మించి, అందులో రకరకాల మొక్కలు నాటి వాకింగ్ చేసే విధంగా నిర్మాణం చేపట్టారు. గ్రామంలో ఉన్న ఐదు పాత ఇండ్లు, రెండు బావులను పూడ్చివేశారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువు తూము నుంచి గ్రామంలోని హనుమాన్ దేవాలయం వరకు మట్టి రోడ్డును వేసి రైతులు వెళ్లేందుకు వీలుగా రోడ్డును నిర్మించారు.
ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి ..
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా అందరూ తమవంతుగా కృషి చేస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చు. ఇప్పటికే గ్రామం లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఎమ్మెల్యే సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మా ణ పనులు చేపట్టాం. పల్లె ప్రగతిలో నాటిన మొక్కలకు నీరు పోస్తూ, వాటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలో ముందుగు సాగుతున్నాం.
-సాప భాగ్యలక్ష్మి, సర్పంచ్
బూర్గుపల్లి రోడ్డు నిర్మాణంతో తీరిన ఇబ్బందులు
గాజిరెడ్డి పల్లి నుంచి బూర్గుపల్లి గ్రామానికి వివిధ అవసరాల కోసం నిత్యం వెళ్లాలంటే కనీసం నడువలేని విధంగా రోడ్లు గుంతలమయంగా ఉండేది. రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడంతో ప్రజలకు రవాణా మెరుగుపడింది. గతంలో గుంతలమయంగా ఉండడంలో ఆర్టీసీ బస్సు కూడా వచ్చేది కాదు. ఇందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు.
-సాప శ్రీను,గాజిరెడ్డిపల్లి