విధి ఎంత విచిత్రమో కదా !! అప్పటిదాకా ఆస్పత్రిలో ఉన్న ఆ పిల్లాడు సర్జరీ తర్వాత కోలుకొని ఇంటికి బయల్దేరాడు.. కానీ మృత్యువు మాత్రం ఆ చిన్నారిని వెంటాడింది. ఆ ఆరేళ్ల పిల్లాడితో పాటు అతని తల్లిదండ్రులను.. చిన్నారికి స్వస్థత చేకూర్చేందుకు వచ్చిన పాస్టర్ దంపతులను బలితీసుకుంది. దీంతో ఏ ఆస్పత్రి నుంచైతే డిశ్చార్చి అయి సంతోషంగా ఇంటికి బయల్దేరారో.. అదే ఆస్పత్రికి కేవలం 15 నిమిషాల్లోనే శవాలై తిరిగొచ్చారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామానికి చెందిన పుర్ర అంబదాస్ (33), పుర్ర పద్మ (25 ) దంపతుల ఆరేళ్ల కుమారుడు వివేక్ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స కోసం సంగారెడ్డిలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ సర్జరీ తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం ఆ బాలుడ్ని డిశ్చార్జి చేశారు. అయితే అనారోగ్యంతో ఇన్నిరోజులు ఆస్పత్రిలో ఉన్న పిల్లాడు.. మళ్లీ ఏ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే పాస్టర్తో ప్రార్థనలు చేయించమని అంబదాస్కు కొంతమంది సన్నిహితులు సూచించారు. దీంతో వారి మాట ప్రకారం అంబదాస్.. రంగంపేటకు చెందిన చర్చి పాస్టర్ లూకా (44), అతని భార్య దీవెన (41)ను ఆశ్రయించాడు. వీరంతా కలిసి బాలుడ్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు సంగారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పాస్టర్ లూకా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆ ఐదుగురు కారులో సంగాయిపేటకు కారులో బయల్దేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు చౌటకూరు వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి.. జోగిపేట నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టారు. దీంతో కారు ముందు భాగం క్యాబిన్ కిందకు చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
కారు ముందు భాగం మొత్తం లారీలోకి చొచ్చుకుపోవడంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది, పుల్కల్ పోలీసులు అతికష్టం మీద కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వారు ఏ ఆస్పత్రి నుంచి అయితే డిశ్చార్చి అయి వచ్చారో అదే సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రోడ్డు ప్రమాదంపై అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహూటిన ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, స్థానికులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.