విద్యానగర్/ఖలీల్వాడి, ఏప్రిల్ 20: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 1,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 3,582 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 779 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 22,053కు చేరిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో 445 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 24,189కు చేరిందని డీఎంహెచ్వో బాలనరేంద్ర తెలిపారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్..
కామారెడ్డి జిల్లాలోని 30 కేంద్రాల్లో మంగళవారం 3,968 మందికి కొవిడ్ టీకా వేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారి నుంచి రూ.54,800 జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 5,007 మందికి కొవిడ్ టీకా వేశామని డీఎంహెచ్వో బాలనరేంద్ర తెలిపారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ రిజిస్ట్రేషన్ చేయించుకొని టీకా తీసుకోవాలని సూచించారు.