డీజీపీఎస్ ద్వారా ప్రధాన కాల్వల సర్వే
49,915 ఎకరాల ఆయకట్టు సర్వే పూర్తి
రెండు మాసాల్లో పూర్తిచేసే దిశగా చర్యలు
ఇటీవల పనులను పరిశీలించిన ఇరిగేషన్ సీఈ
సస్యశ్యామలం కానున్న సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలంటే దశాబ్దాలు పట్టేది. సాగునీటికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. ప్రభుత్వం వేగంగా ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీటిని అందిస్తుండడంతో రైతులకు రంది లేకుండా పోయింది. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే ‘సంగమేశ్వర ఎత్తిపోతల పథకం’ సర్వే పనులు శరవేగంగా చేపడుతున్నారు. రెండు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేసేలా వర్క్ ఏజెన్సీ పనులు చేపడుతున్నది. ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి అయ్యింది. జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సీఎం కేసీఆర్ ఈ ఎత్తిపోతలకు రూపకల్పన చేశారు. ఈ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు జిల్లాను ముద్దాడనున్నాయి.
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే ‘సంగమేశ్వర ఎత్తిపోతల పథకం’ సర్వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో సర్వే కొంత నత్తనడకన సాగింది. ప్రస్తుతం సర్వేకు వాతావరణ అనుకూలంగా ఉండడంతో సర్వే ఏజెన్సీ సాయి గణేశ్ కన్సల్టెన్సీ ముమ్మరంగా సర్వే పనులు చేపడుతున్నది. ఇరిగేషన్ అధికారులు సర్వే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రగతి నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇరిగేషన్ అధికారుల సమాచారం మేరకు ఇప్పటివరకు 30 శాతం సర్వే పూర్తి అయ్యింది. రాబోయే రెండు మాసాల్లో వందశాతం సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అందజేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ రూపకల్పన…
సంగారెడ్డి జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు ఇచ్చేందుకు మంజీరా నదిపై సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సింగూరు ప్రాజెక్టులోకి రానున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి వచ్చిన గోదావరి జలాలను సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలో 1,05,950 ఎకరాలకు, అందోలులో 56,857 ఎకరాలు, సంగారెడ్డిలో 56,193 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా సింగూరు ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచి 15 టీఎంసీల నీటిని లిఫ్టు చేయనున్నారు. దీని కోసం హద్నూర్, హోతికుర్డులో రెండుచోట్ల పంప్హౌస్లు నిర్మించనున్నారు. జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు హద్నూర్, జహీరాబాద్, గోవిందాపూర్, కంది కెనాల్లను నిర్మించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగం గా 180.3 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 383.7 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ కెనాల్లు నిర్మిస్తారు. 386.6 కిలోమీటర్ల మేర మైనర్ కాల్వలను నిర్మించనున్నారు.
మంత్రి చేతుల మీదుగా సర్వే పనులు ప్రారంభం…
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు జూన్ 14న మునిపల్లి మండలం లింగంపల్లిలో ప్రారంభించారు. సాయి గణేశ్ కన్సల్టెన్సీ సంస్థ జూన్ 20 నుంచి సర్వే పనులను ప్రారంభించింది. ప్రధాన కాల్వల డీపీజీఎస్ సర్వే పూర్తికాగా, త్వరలోనే కాలినడకన(వాక్ త్రూ సర్వే) సర్వే పూర్తి కానుంది. ప్రధాన కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటరీ, పిల్ల కాల్వల సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఆయకట్టు సర్వే సైతం సర్వే సంస్థ ప్రారంభించింది. 2.19 లక్షల ఎకరాలకుగాను ఇప్పటివరకు 60 వేల ఎకరాలకు సంబంధించిన ప్రాథమిక సర్వే పూర్తి అయ్యింది. మరో రెండు నెలల్లో సర్వే వందశాతం పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.
శాటిలైట్ ద్వారా సర్వే…
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే వందశాతం కచ్చితంగా ఉండేందుకు సర్వే ఏజెన్సీ శాటిలైట్ ద్వారా సర్వే చేస్తోంది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ, పిల్ల కాల్వల సర్వేలతోపాటు ఆయకట్టు సర్వే సైతం శాటిలైట్ సహాయంతో డీజీపీఎస్(డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ద్వారా చేపడుతున్నారు. 22 డీజీపీఎస్ యంత్రాల ద్వారా 30 మంది ఇంజినీర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది సర్వే పనులు చేపడుతున్నారు. మొదట ప్రధాన కాల్వల నిర్మాణం కోసం డీజీపీఎస్ యంత్రాలను ఉపయోగించి కాల్వలు వెళ్లే ప్రాంతాలను ఆకాంక్ష, రేఖాంశాల ద్వారా మార్కింగ్ చేస్తున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా కంది, హద్నూర్, జహీరాబాద్, గోవిందాపూర్ ప్రధాన కాల్వల సర్వే పూర్తి చేశారు. 161 కిలోమీటర్ల మేర డీజీపీఎస్ ద్వారా ప్రాథమిక సర్వే పూర్తి అయ్యింది. కాలినడకన మరోమారు ఇంజినీర్లు సర్వే నిర్వహించి కాల్వ ఏయే గ్రామాల్లోని ఏయే ప్రాంతాల గుండా కాల్వలు పోయేవి గుర్తించి మ్యాప్లు సిద్ధం చేయనున్నారు. 500 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ, పిల్ల కాల్వలకు సంబంధించిన సర్వే సైతం కొనసాగుతున్నది.
త్వరలోనే ఈ సర్వే పనులు కొలిక్కి రానున్నాయి. ఆయకట్టుకు సంబంధించిన సర్వే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 49 వేల ఎకరాల మేరకు సర్వే పూర్తయ్యింది. ప్రతిరోజూ 200 నుంచి 300 ఎకరాలకు వరకు సర్వే చేసేందుకు సర్వే ఏజెన్సీ సిద్ధ్దమవుతున్నది. మొత్తంగా రెండు నెలల్లో సర్వే పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి డీపీఆర్ అందజేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. హద్నూర్ కెనాల్ వద్ద మరో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి ఆ ప్రాంతంలో అదనంగా 1500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే సంగమేశ్వర ఎత్తిపోతలప పథకం ఆయకట్టు విస్తీర్ణం పెరగనుంది. కాగా, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఇటీవల ఇరిగేషన్ సీఈ అజయ్కుమార్ పరిశీలించారు. సర్వే వేగం పెంచాలని ఇరిగేషన్ అధికారులు, సర్వే ఏజెన్సీకి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు నెలల్లోపే డీపీఆర్ అందజేయాలని సర్వే ఏజెన్సీకి ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.