లింగాలఘనపురం, జూన్ 8 : ఉపాధి హామీ కూలీలందరికీ డబ్బులు చెల్లిస్తామని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని నవాబుపేట, నెల్లుట్ల గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. నర్సరీలు, శ్మశానవాటికల నిర్మాణాల ప్రగతి, పల్లెప్రకృతి వనాలు, ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులు పరిశీలించారు. రెండు నెలల నుంచి కూలి డబ్బులు రావడం లేదని, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని కొంతమంది సీఈవో దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సీఈవో మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో కేంద్రం నుంచి డబ్బులు రావడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఎస్సీ గ్రూపుల కూలీలకు మాత్రమే ఈ అసౌకర్యం ఏర్పడిందన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటున్నారని, అతి త్వరలో సమస్య పరిష్కారమవతుందని వివరించారు. ఎస్సీ గ్రూపులకు చెందిన కూలీలు ఆందోళన చెందొద్దని సూచించారు. ఈసారి హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలన్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించాలని అధికారులను ఆదేశించారు. నెల్లుట్లకు మొదటిసారి వచ్చిన సీఈవోను సర్పంచ్ చిట్ల స్వరూపారాణి సన్మానించారు. ఎంపీడీవో సురేందర్, ఏపీవో రాజకర్ణ, సర్పంచ్ బూడిద జయ, ఈసీ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్రెడ్డి, కరుణాకర్ నాయకులు చిట్ల భూపాల్రెడ్డి, బూడిద రాజేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.
మొక్కలను జాగ్రత్తగా పెంచాలి
నర్మెట : నర్సరీల్లో హరితహారం మొక్కలను జాగ్రత్తగా పెంచాలని ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్ అన్నారు. మండలంలోని ఆగాపేట, ఇప్పలగడ్డ గ్రామాల్లో మంగళవారం ఆయన నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ మొక్కల ఎదుగుదలను బట్టి గ్రేటింగ్ చేయాలని సూచించారు. పెద్దగా పెరిగిన మొక్కలను వేరు చేయాలని అన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి ..
రఘునాథపల్లి : గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పెంచాలని ఎంపీడీవో ఆసిం అన్నారు. మండలంలోని అశ్వరావుపల్లి, వేపలగడ్డతండా, సోమయ్యకుంటతండా, ఇబ్రహీంపూర్, నిడిగొండ, కుసుంబాయితండా, మాదారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ఎంపీడీవో సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీల్లోని మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. మొక్కల సంరక్షణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈసీ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ అనిల్, సర్పంచ్లు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులు తయారు చేయాలి
దేవరుప్పుల : సెగ్రిగేషన్ షెడ్లలో ఈ నెల 15 లోపు సేంద్రియ ఎరువులు తయారు చేయాలని ఎంపీడీవో ఉమామహేశ్వర్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎంపీవో కవికుమార్తో ఆయన పర్యటించారు. సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేర ఈ నెల 15 లోపు అన్ని గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్లు పూర్తిస్థాయిలో పనిచేయాలన్నారు. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్లలో వేసి వర్మీకంపోస్ట్ ఎరువును తయారు చేయాలని అన్నారు. హరితహారం కోసం అన్ని నర్సరీల్లో మొక్కల గ్రేడింగ్, షిఫ్టింగ్ చేయాలని చెప్పారు. వంద శాతం మొక్కలు బతికేలా నీరు అందించాలని, పంచాయతీ కార్యదర్శులు నర్సరీల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రజల్లో తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించాలని సూచించారు.