కొండపోచమ్మసాగర్ నుంచి నిజాంసాగర్ వరకు జలపరవళ్లు
18 రోజుల్లో 96 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కాళేశ్వర గంగ
మండుటెండల్లో జలసవ్వడిపై కర్షకుల సంభ్రమాశ్చర్యాలు
ప్రాజెక్టుకు పునరుజ్జీవంపై ఆయకట్టు రైతుల్లో ఆనందం
మేడిగడ్డ వద్ద నిర్మించిన అత్యంత పొడవైన లక్ష్మి బ్యారేజీ వద్ద నిలిచిన గోదావరి జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి సరస్వతీ బ్యారేజీని నింపారు. అక్కడి నుంచి సుందిళ్ల దగ్గరి పార్వతి బ్యారేజీకి పంప్ చేశారు. సుందిళ్ల పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్, సొరంగ మార్గం గుండా ఈ నీరు నంది మేడారం పంప్ హౌస్కు చేరింది. అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ సర్జ్పూల్కు, అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువలోకి మళ్లింది. మిడ్ మానేరు రిజర్వాయర్ నింపి అన్నపూర్ణ రిజర్వాయర్కు, రంగనాయక సాగర్కు చేర్చారు. ఇన్ని దశలు లిఫ్టులు, సొరంగాలు, గ్రావిటీ కాల్వల ద్వారా సుమారు 618 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండపోచమ్మ రిజర్వాయర్కు చేరిన గోదావరి జలాలు గ్రావిటీ కాల్వ సొరంగం ద్వారా ప్రవహించి మందం చెరువు, పెద్ద చెరువు, ధర్మరావుపేట చెరువు, ఖాన్ చెరువు నింపుతూ హల్దీవాగుపై ఉన్న 32 చెక్డ్యామ్లకు జలకళను తీసుకు వచ్చింది. అనంతరం మంజీరానదికి చేరి మంజీరపై ఉన్న రెండు చెక్ డ్యామ్లు నిండిన తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టును చేరింది. ఇలా గోదావరి జలాల ప్రయాణం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అకుంఠిత జలదీక్షకు అద్దంపట్టే కాళేశ్వరం ప్రాజెక్టు దాగి ఉంది. కొండపోచమ్మ సాగర్ నుంచి దిగువకు ఏప్రిల్ 6న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వదిలిన కాళేశ్వరం నీళ్లు సరిగ్గా ఏప్రిల్ 23 శుక్రవారానికి నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన గేట్లను ముద్దాడడంతో గమ్యం ముగిసింది.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు సరికొత్త అధ్యాయం సాక్షాత్కారమైంది. బోసిపోతున్న ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ఊపిరి దక్కింది. ఏప్రిల్ 6వ తేదీనాడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ నుంచి ప్రయాణం మొదలుపెట్టిన గోదావరి నీళ్లు 18 రోజుల అనంతరం శుక్రవారం చారిత్రక ప్రాజెక్టు గేట్లను ముద్దాడాయి. 96 కిలో మీటర్ల దూరం నుంచి సిద్ధిపేట, మెదక్ జిల్లాలను దాటుకొని కామారెడ్డి జిల్లాలోకి జలాలు మూడు రోజుల క్రితమే చేరాయి. దారిపొడవునా అనేక చెక్డ్యామ్లను, చెరువులను నింపుతూ వచ్చిన కాళేశ్వరం నీళ్లు ఎట్టకేలకు నిజాంసాగర్ ప్రాజెక్టును చేరడంతో రైతన్నలంతా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం దక్కిందని ఆనందపడుతున్నారు. వానకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సాగుకు మాత్రం ఢోకా లేదనే ధీమా వారిలో స్పష్టంగా కనిపిస్తున్నది. రెండు పంటలకు మెండుగా సాగు నీటి సౌకర్యం దక్కడం ఖాయమని కర్షకలోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది.
ఇక పొలాలకు పరుగులు..
అనేక అడ్డంకులను దాటుకొని నిజాంసాగర్ ప్రాజెక్టును చేరిన కాళేశ్వరం జలాలు ఇక ఆయకట్టు రైతుల భూములను తడపనున్నాయి. ప్రస్తుతం 18 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం గోదావరి నీళ్లు మంజీరానదిపై నిర్మించిన చారిత్రక ప్రాజెక్టులోకి చేరాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 6 టీఎంసీల నీరుంది. వానకాలం సీజన్కు సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లను తరలిస్తున్నారు. వచ్చే వానకాలంలో వర్షాలు అనుకూలించినా, ప్రతికూలించినా ఆయకట్టు రైతులకు మాత్రం సాగు నీటి కొరత ఉండదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న జలాలతో పాటు కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చే అదనపు నీళ్లతో వానకాలం సాగు జోరుగా జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయకట్టు రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట కోతలు ఎప్పుడో ప్రారంభించి పంటను విక్రయించుకున్నారు. కొద్ది రోజుల్లోనే వానకాలం పంట సాగుకు సిద్ధం అవుతున్న తరుణంలో సాగు నీటి ధీమా వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నది. కేసీఆర్ అందిస్తున్న సాగు స్ఫూర్తితో వచ్చే సీజన్లో మరింత జోరుగా పంటలు సాగు చేయాలనే ఉత్సాహంలో అన్నదాతలు ఉన్నారు.
నిజాంసాగర్లోకి చేరిన గోదారమ్మ
నిజాంసాగర్/నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 23: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు మంజీరా నదిలో పరవళ్లు తొక్కుతున్నాయి. 6వ తేదీన సీఎం కేసీఆర్ గోదావరి నీటిని హల్దీవాగు ద్వారా నిజాంసాగర్కు విడుదల చేశారు. గ్రావిటీ కాలువలు, వాగులు, చెక్డ్యాం లు, ఎత్తిపోతలు, అలుగులు దుంకిన గో దావరి జలాలు ఈనెల 21న కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలాన్ని తాకిన జలాలు బుధవారం నిజాంసాగర్ ప్రాజె క్టు బ్యాక్ వాటర్లో చేరగా శుక్రవారం ని జాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ముద్దాడా యి. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు రోజుకు 1600 క్యూసెక్కుల చొప్పున విడుదల కొనసాగుతుండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో సుమారు 96 కిలోమీటర్లు దూరం గోదావరి జలాలు ప్రవహిస్తూ నిజాంసాగర్కు చేరాయి.
ఇవి కూడా చదవండి
సైనిక విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లు