రాష్ట్రంలో ప్రాణవాయువు కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొంటున్నది. ఒడిశా నుంచి అందాల్సిన ఆక్సిజన్ను త్వరగా రాష్ర్టానికి చేర్చేందుకు దేశంలోనే తొలిసారిగా సైనిక రవాణా విమానాల సేవలను వినియోగించుకొంటున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఎనిమిది ట్యాంకర్లను సైనిక విమానాలు ద్వారా ఒడిశాలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్కు పంపించింది. వీటిలో మూడు ట్యాంకర్లు సాయంత్రానికే 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నింపుకొని తెలంగాణకు తిరుగు పయన మయ్యాయి. ఈ మూడు ట్యాంకర్లు ఆదివారానికి రాష్ర్టానికి చేరుకుంటాయి. మిగతా ట్యాంకర్లు ఈ నెల 27లోగా రోడ్డు మార్గంలో తిరిగి రాష్ర్టానికి వస్తాయి. వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర అధికారులు బేగంపేట విమానాశ్రయంలో విమానాల ద్వారా ట్యాంకర్లను పంపే ప్రక్రియను పర్యవేక్షించారు. వింగ్ కమాండర్ చైతన్య నిజ్హవాన్ ఆధ్వర్యంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు సీ-17 ఎయిర్క్రాఫ్ట్లను ఇందుకు వినియోగించారు.
రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనేందుకైనా వెనుకాడదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో ఆక్సిజన్ సరఫరా కోసం సైనిక రవాణా విమానాలను ప్రయత్నమని కొనియాడారు. సైనిక రవాణా విమానాల్లో 8 ట్యాంకర్లను ఒడిశాకు పంపించామని చెప్పారు. ఆ రాష్ట్రంలోని అంగుల్, రూర్కెలా స్టీల్ప్లాంట్ల నుంచి ఈ ట్యాంకర్లు 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను నింపుకొని రోడ్డుమార్గంలో ఈ నెల 27లోగా తెలంగాణకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వల్ల మూడు రోజుల సమయం ఆదా కావడంతోపాటు, ప్రజల విలువైన ప్రాణాలను కాపాడిన వారమవుతామని తెలిపారు. 22 ప్రభుత్వ దవాఖానల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటుచేశామని, ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ దవాఖానల్లో ఎకడా ఆక్సిజన్ కొరత రాలేదని మంత్రి గుర్తుచేశారు.
కేటీఆర్ అభినందన
సైనిక రవాణా విమానాల ద్వారా అక్సిజన్ అందించే చర్యలను పర్యవేక్షించిన మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్ను మంత్రి కేటీఆర్ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అభినందించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్చేశారు.