బొంరాస్పేట, డిసెంబర్ 28 : గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్య లోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, పచ్చదనం పెంపునకు నాటిన మొక్కలను సంరక్షించాలని ఆదేశించారు. మొక్కల రక్షణకు నాటిన ట్రీ గార్డులు పాడైతే కొత్తవాటిని అమర్చాలని, ప్రతి శుక్రవారం మొక్కలకు వాటరింగ్ చేయాలని సూ చిం చారు.
గ్రామ పంచాయతీలో రికార్డుల నిర్వహణ బాగుండాలని, పన్నుల వసూలును వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఎల్పీవో శంకర్నాయక్, ఎంపీడీవో పాండు పాల్గొన్నారు. అంతకు ముందు చౌదర్పల్లి గ్రామంలో పల్లె ప్రకృతివనం, కంపోస్ట్ షెడ్, నర్సరీ, ఉన్నత పాఠశాలకు నిర్మిస్తున్న ప్రహరీ పనులను డీపీవో తరుణ్కుమార్ పరిశీలించారు. నర్సరీల్లో ఈ నెలాఖరు నాటికి విత్తనాలను నాటాలని నిర్వాహకులను ఆదేశించారు. నర్సరీల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పీపీవీ, నర్సరీ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్ వెంకటమ్మ, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.