రంగారెడ్డి, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనున్నది. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వెలువడలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలో 558 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పర్సన్ ప్రస్తుత సర్పంచులనే ఇన్చార్జీలుగా నియమిస్తుందా ? లేక ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగిస్తుందా ! అన్నదానిపై సస్పెన్స్ నెలకొన్నది.
మరో పక్క పాత రిజర్వేషన్లతో ఎన్నికలను నిర్వహిస్తారా ? లేక రిజర్వేషన్లను మార్చి నిర్వహిస్తారా ? అన్నదానిపై కూడా చర్చ జరుగుతున్నది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 558 గ్రామ పంచాయతీలు, 4,992 వార్డులు ఉన్నాయి. 2019లో వీటికి మూడు విడుతలుగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరించారు. మరో తొమ్మిది రోజుల్లో వీరి పదవీ కాలం ముగియనున్నది. ఎన్నికలు నిర్వహించదల్చితే కనీసం నెలన్నర రోజుల ముందే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండేది. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో కొద్దిరోజులుగా ఎన్నికల హడావిడి చేసిన అధికారులు ప్రస్తుతానికి మిన్నకుండిపోయారు. లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా ఆగాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. తమ పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని సర్పంచ్లు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు.
ఎన్నికలు నిర్దేశిత గడువులోపు జరగకపోవడంతో ప్రభుత్వం అనుకుంటే పర్సన్ ఇన్చార్జీలుగా ప్రస్తుత సర్పంచులనే కొనసాగించే అవకాశం ఉన్నది. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. గడువు ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించని పక్షంలో ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించాలని చట్టంలో స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల నియామకం వైపుగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మండల స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించేందుకు అవసరమైన ప్రక్రియ అంతర్గతంగా ఇప్పటికే జిల్లాలో మొదలైనట్లు సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ విధానం అమలులో ఉంటుంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పాత విధానాన్నే కొనసాగిస్తారా ? లేక మార్పులు ఏమైనా ఉంటాయా ? అన్నదానిపై సందిగ్ధత నెలకొన్నది. బీసీల రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల హామీలో ప్రకటించింది. బీసీ గణన చేపట్టి ఆయా గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే 2006 సంవత్సరం ఎన్నికల నుంచి కొనసాగిన బీసీఈ సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలను ఇటీవలనే బీసీ కమిషన్ సేకరించింది. రిజర్వేషన్లు మార్చాలంటే మరోసారి చట్టం చేయాల్సి ఉండడంతో ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. ఒకవేళ చట్టాన్ని సవరించకుండా పాత విధానాన్నే కొనసాగిస్తే.. ప్రస్తుతం రిజర్వుడ్ స్థానాల్లో సర్పంచ్గా ఉన్నవారు.. మరోసారి పోటీలో నిలిచేందుకు అవకాశం కలుగుతుంది.