Vishal | తమిళనాడు సీఎం సూపర్స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన సాధించిన విజయాలపై ప్రముఖ నటుడు విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎంతో మంది ప్రముఖ నటులు రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించలేకపోయినా, విజయ్ మాత్రం సీఎంగా ఎందుకు సక్సెస్ అయ్యారనే దానిపై విశాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ఆయన్ను కలిశానని, ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని, కేవలం ఆయన హోదా మాత్రమే మారిందని విశాల్ తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సినిమా నటులందరూ రాజకీయాల్లో రాణించలేరని స్పష్టం చేశారు. శివాజీ గణేశన్, కే భాగ్యరాజ్ వంటి లెజెండరీ నటులు కూడా గతంలో పార్టీలు పెట్టి విఫలమయ్యారని, అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి వంటి దిగ్గజాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వారు రాజకీయాల్లో అనుకున్నంతగా రాణించలేకపోయారని గుర్తుచేశారు.
అయితే విజయ్ విషయానికి వస్తే అది కేవలం నటన వల్ల రాలేదని, ప్రజల్లో తీవ్రమైన మార్పు కోరుకోవడం వల్లే ఆయనకు ఈ విజయం దక్కిందని విశాల్ పేర్కొన్నారు. ప్రజలకు ఒక బలమైన ప్రత్యామ్నాయం కావాలనిపించిందని, విజయ్ మాట్లాడే తీరు, ఆయనతో ఉన్న కనెక్టివిటీ ఫ్యాక్టర్ ప్రజలను ఆయన వైపు ఆకర్షితులుగా చేశాయని తెలిపారు. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార ముగింపు రోజు విజయ్ చేసిన ప్రసంగం ఆయన రాజకీయ భవితను పూర్తిగా మార్చివేసిందని విశాల్ అభిప్రాయపడ్డారు. “మీ తల్లిదండ్రులకు, తాతాబామ్మలకు చెప్పండి.. ఒక్కసారి నాకు ఓటు వేయమని కోరండి” అంటూ విజయ్ చేసిన అభ్యర్థన ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిందని, మనవరాళ్లు చెప్పిన మాట విని ఓటర్లు ఆయనకు ఓటేశారని ఒక జడ్జి స్వయంగా చెప్పిన ఉదాహరణను ఆయన గుర్తుచేేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే, విశాల్ తొలిసారిగా దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మగుడం’ (తెలుగులో మకుటం) ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.