శేరిలింగంపల్లి/మొయినాబాద్, ఆగస్టు 29 : గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి మృతి చెందగా, అడ్డుకున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు విద్యుత్తు తీగలు పట్టుకొని ఆత్మహత్యకు యత్నించి.. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నా డు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, కోచ్బీహార్ జిల్లా, లంకపార గ్రామానికి చెందిన దీప్నాతమాంగ్ (26) గోపన్పల్లితండాలో మరో ముగ్గురు యువతులతో కలిసి అద్దెకుంటున్నది. ఓ బ్యూటీపార్లర్లో బ్యుటీషియన్గా పనిచేస్తున్నది. ఆమె బెంగళూరులో పనిచేసిన సమయం లో బీదర్కు చెందిన రాకేశ్ (25)తో పరిచయం ఏర్పడింది.
అతడు కూడా మాదాపూర్లోని హాస్టల్లో ఉంటూ.. మరో బ్యూటీపార్లర్లో పనిచేసేవాడు. ఇద్దరు మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొంతకాలంగా దీప్నా మరో వ్యక్తి తో సన్నిహితంగా ఉంటుందనే కారణంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి గోపన్పల్లి తండాలోని దీప్నాతమాంగ్ నివసిస్తున్న ఇంటికి వచ్చిన రాకేశ్ .. మాట్లాడాలంటూ బయటకు పిలిచాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో దీప్నాతమాంగ్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
15 కత్తిపోట్లకు గురైన దీప్నా.. రక్తపుమడుగులో పడిపోయింది. అరుపులు విని అడ్డుకునేందుకు యత్నించిన ఆమె స్నేహితులు సావిత్రి, పునీత, కృష్ణ తమాంగ్లపైనా రాకేశ్ దాడి చేసి పరారయ్యాడు. బాధితుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీప్నాతోపాటు ఆమె స్నేహితులను దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే దీప్నా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాడి అనంతరం రాకేశ్ బీదర్లో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఇదే తన చివరి రోజు అంటూ మెసేజ్ పెట్టాడు.
దీంతో రాకేశ్ తల్లిదండ్రులు కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు రాకేశ్కోసం గాలించగా..మొయినాబాద్లో ఉన్నట్లు అతడి సెల్ఫోన్ సిగ్నళ్ల ద్వారా గుర్తించారు. అక్కడి వెళ్లి చూసేసరికి విద్యుత్తు తీగలను పట్టుకొని సగం కాలిన గాయాలతో రాకేశ్ కనిపించాడు. నిందితుడిని చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.