రంగారెడ్డి, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈనెల 5న నిర్వహించనున్న రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షా కేంద్రాలకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఎస్పీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్, ఎంపీఎల్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ పరీక్షలకు రంగారెడ్డి జిల్లాలో 44 కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో అభ్యర్థి ఫొటో, లేదా పేరులో ఏవైనా తప్పిదాలు ఉంటే మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోల మీద గెజిటెడ్ అధికారి సంతకంతో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంట సెల్ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వెంట తీసుకు రాకూడదని, షూ ధరించరాదని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ డీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, టీఎస్పీఎస్సీ సెక్షన్ అధికారులు బి.మల్లేశ్, వి.రమణమ్మ, అసిస్టెంట్ సెక్షన్ అధికారులు కె.వెంకటేశ్వర్ రెడ్డి, టి.శ్రీదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల బందోబస్తు..
పోలీసు శాఖ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్, ఒక ఆశ వర్కర్ను ఆయా పరీక్షా కేంద్రాల వద్ద వైద్యాధికారులు అందుబాటులో ఉంచుతారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్షా సజావుగా జరిగేందుకు ప్రతి అధికారి వారి వారి విభాగాల్లో కృషి చేయనున్నారు.