తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ప్రతి గ్రామంలోని ఎస్హెచ్జీలో ముగ్గురి చొప్పున ఎంపిక చేసి వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నది. ఎస్హెచ్జీ సభ్యులకు వ్యక్తిగత రుణాలను సైతం అందజేస్తూ స్వయం ఉపాధిని కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ఏటా లక్ష్యానికి మించి రుణాలను అందజేస్తూ అతివల ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. తొమ్మిదేండ్లలో రంగారెడ్డి జిల్లాలో రూ.3,588 కోట్లు, వికారాబాద్ జిల్లాలో రూ.2112 కోట్ల రుణాలను బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి కింద ఎస్హెచ్జీలకు అందజేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎంచుకున్న వాణిజ్య, వర్తక, సేవా పరమైన యూనిట్ల ఏర్పాటుతో పాటు వ్యాపారాల్లో మెళకువలపై శిక్షణను సైతం ప్రభుత్వమే ఇస్తున్నది. మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్వయం సహాయక సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా తొమ్మిదేండ్లలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం మొదలుకొని కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఆరోగ్య మహిళా పథకం, ఒంటరి మహిళలకు పింఛన్లు తదితర సంక్షేమ పథకాలతోపాటు గృహలక్ష్మి పేరిట సొంత జాగ ఉన్న వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం చేయనున్నారు. అతివలకు అండగా నిలిచేందుకు షీ టీమ్స్, భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి రక్షణ కల్పిస్తున్నారు. పోలీస్ శాఖ రిక్రూట్మెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అమల్లోకి తీసుకువచ్చింది. మరోవైపు మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్ కల్పించడంతోపాటు మహిళా ఉద్యోగినులకు ప్రసూతి సెలవులను కూడా పెంచుతూ గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తున్నది. మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా వి-హబ్ ఏర్పాటు చేయడంతోపాటు గ్రామీణ మహిళలు కూడా వ్యాపారులుగా రాణించేందుకు వారికి నైపుణ్యం ఉన్న రంగాల్లో శిక్షణనివ్వడంతోపాటు విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు రుణాలను కూడా మంజూరు చేస్తూ ఆర్థిక వృద్ధి సాధించడంలో చేయూతనందిస్తున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే లక్ష్యంతో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి కింద రుణాలను మంజూరు చేయడంతోపాటు వ్యాపారులుగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేండ్లలో 71,705 స్వయం సహాయక సంఘాలకు రూ.2112 కోట్ల రుణాలను మంజూరు చేసింది. దీంతోపాటు వడ్డీ డబ్బులను కూడా ప్రభుత్వం ప్రతి ఏటా మాఫీ చేస్తూ వస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1904 స్వయం సహాయక సంఘాలకు రూ.127.33 కోట్ల రుణాలను మంజూరు చేశారు.
విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామీణ మహిళలను వ్యాపారులుగా మారేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలోని స్వయం సహాయక సంఘాల్లో ఆసక్తిగల వారిలో ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, వారికి స్వయం ఉపాధి కల్పనలో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాలను, ఆర్థిక వనరులను కల్పించి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2500 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు. ఎస్హెచ్జీలు ఉత్పత్తి సంబంధిత వ్యాపారాలతోపాటు వాణిజ్య, వర్తక వ్యాపారాలు, సేవా పరమైన వ్యాపారాలను ప్రారంభించారు. సంబంధిత 2500 మందికి వ్యాపారాలను నిర్వహించుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా సుమారు రూ.30 కోట్ల రుణాల వరకు అందజేశారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపారం చేసేందుకు ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : వివిధ వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించి ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బ్యాంకుల ద్వారా ఇతోధికంగా బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిశుల ద్వారా రుణాలను అందజేస్తున్నది. వివిధ యూనిట్లను ఏర్పాటుచేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు లింకేజా ద్వారా తొమ్మిదేండ్ల కాలంలో రూ.3,588కోట్లను అందజేసింది. ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో మహిళలు వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాదిలో బ్యాంకు లింకేజే ద్వారా రూ.710కోట్లు, స్త్రీ నిధి ద్వారా రూ.112కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకునేందుకు గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో స్వయం సహాయక సంఘాలు : 19,192
మొత్తం సభ్యుల సంఖ్య : 2,06,715
తొమ్మిదేండ్లలో అందించిన రుణాలు : రూ.3,588కోట్లు
జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో జిల్లాలో ఒక జిల్లా సమాఖ్య ఉండగా.. 21 మండల మహిళా సమాఖ్యలు ఉన్నాయి. గ్రామ మహిళా సంఘాలు 788 ఉన్నాయి. జిల్లాలో ఉన్న 19,192 స్వయం సహాయక సంఘాలలో మొత్తం 2,06,715 మంది సభ్యులు కొనసాగుతున్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రతి యేటా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందించి స్వావలంబనకు తోడ్పాటునందిస్త్నుది. 2022-23లో 12,061 సంఘాలకు రూ.811కోట్ల రుణాలను అందజేశారు. 2023-24 సంవత్సరానికి 12,989 సంఘాలకు రుణం ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా.. ఈ ఏడాది జూలై నాటికి 2,085 సంఘాలకు రూ.2.66కోట్ల రుణాలను అందజేశారు. గడచిన తొమ్మిదేండ్లలో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.3,588కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేసింది. స్త్రీ నిధి ద్వారా 2022-23లో రూ.100.43కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని రూ.73.48 కోట్లను అందజేసింది. 2023-24 సంవత్సరానికి రూ.112కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు రూ.3.88కోట్ల రుణాలను పంపిణీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియకముందే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా రుణ ప్రగతిలో జిల్లా ప్రత్యేక గుర్తింపును పొందుతుండడంతో అదే ఉత్సాహంతో ఈసారి కూడా రుణాలు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో జిల్లాలోని మహిళా సంఘాలు స్వయం సమృద్ది దిశగా ముందుకు సాగుతున్నాయి. సభ్యుల ఆర్థిక అవసరాల మేరకు వ్యవసాయ, అనుబంధ రంగాలు, కిరాణ దుకాణాలు, పిండిగిర్నీ, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఫుట్వేర్ తదితర వ్యాపారాలకు రుణాలను అందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన సంఘాలు ఆరు నెలలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి కూడా విరివిగా రుణాలను అందజేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.50వేల నుంచి రూ.5లక్షల లోపులోనే మహిళా సంఘాలకు రుణం ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.లక్ష నుంచి రూ.20లక్షల వరకు అర్హతను బట్టి రుణాలను మంజూరు చేస్తున్నది. తీసుకున్న రుణాలను ఏ విధంగా పెట్టుబడికి ఉపయోగించాలి.. సకాలంలో తిరిగి రుణాలు చెల్లించడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించి వారిని చైతన్యపరుస్తున్నారు. ఫలితంగా మహిళా సంఘాల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
ఈ ఏడాదీ లక్ష్యాన్ని అధిగమిస్తాం
– ప్రభాకర్, డీఆర్డీవో, రంగారెడ్డి జిల్లా
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి వార్షిక రుణ లక్ష్యం పెరిగింది. ప్రతి ఏటా ప్రభుత్వం నిర్దేశిస్తున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నాం. నిర్దేశించుకున్న రుణ లక్ష్యాన్ని కూడా అధిగమిస్తాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలకనుగుణంగా మండలాలవారీగా సమీక్షలు నిర్వహించి అర్హులైన వారందరికీ రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.